ఎప్పటిలా ఉండకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలి : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

ఎప్పటిలా ఉండకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలి : మంత్రి శ్రీనివాస్​ గౌడ్

యాదాద్రి, వెలుగు: ఎప్పటిలా ఉండకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ అన్నారు. ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మున్సిపాలిటీలో పర్యటించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువాలు వేసి టీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న ఓ వ్యక్తితో 'మా కేసీఆర్​ సార్​ఒకప్పుడు కాంగ్రెస్​లో ఉండే. టీడీపీలోకి పోయిండు. తర్వాత టీఆర్ఎస్​ పెట్టిండు. తెలంగాణ వచ్చింది. మనం కూడా ఎప్పటిలా కాకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలె.' అని అన్నారు. బీజేపీకి చెందిన క్రియాశీలక కార్యకర్తకు కండువా వేస్తూ ‘ఏముందయ్య బీజేపీలో. ఇప్పుడు మంచిగా చేసుకో ’ అని అన్నారు. తర్వాత ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓ ఇంటి వద్ద ఆగిన మంత్రి ఓ వృద్ధురాలితో మాట కలిపారు. పింఛన్​ వస్తుందా? అని అడగడంతో ఆమె రావడం లేదని చెప్పింది.

ఆమె కొడుకు ఆర్టీసీ డ్రైవర్​ కాబట్టి రావడం లేదని తెలుసుకొని ‘నీ కొడుక్కు రూ. 12 వేలు జీతం పెంచినం. టీఆర్ఎస్​కు ఓటెయ్’ అంటూ ముందుకు కదిలారు. ప్రచారంలో భాగంగా కొందరు మహిళలను పలకరించారు. ‘ఎస్సీ కాలనీలో అంగన్​వాడీ సెంటర్​, బిల్డింగ్​లేక మీటింగ్​చెట్ల కింద పెట్టుకుంటున్నం. శ్మశానవాటికలో వసతులు కావాలి’ అని  కోరారు. దీంతో ఆయన ‘రెండు మూడు రోజుల్లోనే పనులు స్టార్ట్​ చేయిస్తా. అంగన్​వాడీ సెంటర్​కు ప్రొసీడింగ్​ఇప్పిస్తా. తెలిసిన కాంట్రాక్టర్​ ఉంటే పనులు స్టార్ట్​ చేయించుకోండి. శ్మశానవాటికకు రోడ్డు, వసతులు కల్పిస్తాం. సంఘ బంధం బిల్డింగ్​ కూడా ఇప్పిస్తా’ అని హామీ ఇచ్చారు. చౌటుప్పల్ మండలం డీ నాగారలో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిబాయి తండాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్​రెడ్డి, నన్నపనేని నరేందర్, చేనేత రాష్ట్ర సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్​ను దెబ్బతీయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.