- హెల్త్స్టాఫ్కు కేంద్రం ఇచ్చినట్లే రాష్ట్రం రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- మరణించిన స్టాఫ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
- ఫ్యామిలీల్లో అందరికీ వెంటనే వ్యాక్సిన్ అందించాలని డిమాండ్
- 20 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటు
- సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరిక
కరోనా బారిన పడి మృతి చెందిన హెల్త్ స్టాఫ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, హెల్త్ సిబ్బంది పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం పదిరోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం జేఏసీ ప్రతినిధులు డీహెచ్ శ్రీనివాసరావును కలసి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, వెలుగు: కరోనా బారిన పడి మృతి చెందిన హెల్త్ స్టాఫ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతమంది హెల్త్ స్టాఫ్ మరణించారన్న లెక్కలు కూడా ప్రభుత్వం వద్ద లేవని, ప్రాణాలకు తెగించి డాక్టర్లు, హెల్త్ సిబ్బంది పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ బతుకులకు భరోసా కల్పించాలని, అలా కల్పిస్తే కరోనా ఎన్ని వేవ్లు వచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, వారం పదిరోజుల్లో తమ సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. హెల్త్ స్టాఫ్ పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 20 వైద్య, ఆరోగ్య సంఘాలు శనివారం జేఏసీగా ఏర్పడ్డాయి. సమస్యల పరిష్కారానికి కలిసి పోరాటం చేస్తామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు కోఠిలోని డైరక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసు వద్ద నిరసన తెలిపి.. డీహెచ్ శ్రీనివాసరావు కు వినతిపతం అందజేశారు.
24 గంటలూ ఎట్ల పనిచేస్తం: డాక్టర్ రవిశంకర్
రాష్ట్రంలో 50 మందికిపైగా వైద్యసిబ్బంది చనిపోయారని, వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా కేంద్రం ఇచ్చే రూ. 50 లక్షలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 50 లక్షలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య సంఘాల జేఏసీ ప్రతినిధి డాక్టర్ రవిశంకర్ డిమాండ్ చేశారు. అదే విధంగా వారి ఇంట్లో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. హెల్త్ స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేశారు. కంటిన్యూగా డ్యూటీలు చేయడంతో డాక్టర్లపై పని ఒత్తిడి పెరుగుతోందని, వర్క్ ప్రెజర్ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తాము కూడా మనుషులమేనని, 24 గంటలు పనిచేయడం సాధ్యం కాదని, షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు చేయించాలని కోరారు. 2017 టీఎస్పీఎస్సీ ద్వారా కొంత మంది డాక్టర్ల రిక్రూట్ మెంట్ జరిగిందని, అయితే పలు కారణలతో భర్తీ నిలిచిపోయిందని, ఆ రిక్రూట్ మెంట్ జరిపితే ప్రస్తుతం కొంతవరకు పనిభారం తగ్గుంతుందన్నారు. తమ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య శాఖను కూడా సీఎం కేసీఆర్ కేసీఆర్ చూస్తుండటంతో ఆయనను కలిసేందుకు వీలులేకపోవడంతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ను కలిశామని, తమ సమస్యలను పరిష్కరించేలా సీఎంకు చెప్పాలని కోరినట్లు వివరించారు. సమస్యలు పరిష్కరిస్తే కరోనా ఎన్ని వేవ్లు వచ్చినా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
డాక్టర్లను పట్టించుకోరా?: డాక్టర్ జనార్దన్రెడ్డి
కరోనాపై యుద్ధం చేస్తూ ప్రజలను కాపాడుతున్న డాక్టర్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కత్తి జనార్దన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కరోనా బారినపడి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, అన్ని హాస్పిటళ్లలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని, నిమ్స్లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేసి హెల్త్ స్టాఫ్ అందరికీ ట్రీట్ మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఇన్సెంటివ్స్ గతేడాది ఏప్రిల్, మే రెండు నెలలు మాత్రమే ఇచ్చారని, ఆ తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వడంలేదన్నారు. బేసిక్ శాలరీలో 30 శాతం ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
పోస్టింగ్లు ఎందుకు ఇవ్వడం లేదు: సుజాత
24 గంటలూ డ్యూటీ చేస్తూ నర్సులు ఒత్తిడికి గురవుతున్నారని రాష్ట్ర నర్సెస్ అసోసియేష్ ప్రెసిడెంట్ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. 2017 స్టాఫ్ నర్సెస్ రిక్రూట్ మెంట్జరిగి రిజల్ట్స్ కూడా వచ్చినప్పటికీ నేటికి పోస్టింగ్లు ఇవ్వడంలేదని, ఈఎన్ టీ లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నప్పటికీ స్టాఫ్ను పెంచడంలేదని, దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోందన్నారు.