
YCP పార్టీ అధినేత జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్నేశారని ఆరోపించారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఆ కుట్రను తిప్పికొడతామన్నారు. తెలంగాణలో డిక్టేటర్ మాదిరి తయారైన కేసీఆర్ ఆంధ్రాను జగన్ ద్వారా డిక్టేట్ చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి నేతలతో ఆయన ఇవాళ(శనివారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రుణాల మాఫీ కోసం రాష్ట్రాన్ని జగన్ కేసీఆర్కు అమ్మేస్తున్నాడనే భావన ప్రజల్లో బలపడుతోందన్నారు చంద్రబాబు. మోడీ, కేసీఆర్, జగన్ ఏపిపై పెత్తనం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఓటుతో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అప్పుడు అన్యాయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్పై ఎంత కోపం , కసి ప్రజలు చూపారో ఇప్పుడు YCP అంతే ఆగ్రహంతో ఉన్నారన్నారు చంద్రబాబు.
జగన్ది సైకో మనస్తత్వం, జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు కూడా తండ్రి చావుని రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద అఫిడవిట్ను జగన్ దాఖలు చేశారని, 31 కేసుల్లో నిందితుడిగా…ఇన్ని నేరాలతో ఇంకెవరూ అఫిడవిట్ దాఖలు చేయరన్నారు. టీడీపీ సభల్లో ప్రజల ఉత్సాహం చూపిస్తున్నారని…. అంతటా టీడీపీ పట్ల సానుకూలత కనిపిస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.