- బేగంపేట్ ఎయిర్ పోర్ట్లో కార్యకర్తలు, లీడర్ల హడావుడి
ట్యాంక్ బండ్, వెలుగు: హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని జలవిహార్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. జగన్కు స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్కు తరలిచ్చారు.
అభిమానులు ‘సీఎం.. సీఎం.. ’అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వేల సంఖ్యలో కార్యకర్తలు, లీడర్లు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడటంతో కొంత తోపులాట చోటుచేసుకున్నది. జగన్ను కలిసిసేందుకు భారీగా కార్యకర్తలు రావడంతో బేగంపేటలో ట్రాఫిక్జామ్ ఏర్పడింది. మరోవైపు, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు వెళ్లే దారిలో పలుచోట్ల అభిమానులు.. జగన్, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలు కలిపి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనంతరం జలవిహార్లో జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
