
ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన జగన్ పల్నాడు పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనలో కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారు నెంబర్ AP 40 DS 2349గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా కారు యజమానిని చేర్చాలని నిర్ణయించారు.
వైసీపీ పేరిట జగన్ OSD కృష్ణమోహన్రెడ్డి ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రమాదం జరిగినరోజు 304A సెక్షన్పై కేసు నమోదైంది. జగన్ కారు కింద సింగయ్య మృతి చెందినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం. FIRలో అదనంగా 304 పార్ట్-2 సెక్షన్ చేర్చే అవకాశం కూడా ఉంది. BNS సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయాలని కూడా ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో శనివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోపై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
జగన్ కాన్వాయ్ ఒక వృద్ధుడిని నిర్ధాక్షిణ్యంగా తొక్కి చంపేసిందని టీడీపీ, అది ఏఐ వాడుకుని చేసిన కల్పిత వీడియో అని.. ఆ వృద్ధుడు పడింది జగన్ కాన్వాయ్ కింద కాదని వైసీపీ సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నాయి. సింగయ్య జగన్ కాన్వాయ్ కింద పడలేదని పోలీసులే చెప్పారని వైసీపీ, వైఎస్ జగన్ కారు కింద సింగయ్య పడినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ నిర్ధారించారని టీడీపీ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ సమయంలో పోలీసులు జగన్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడం, ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ను A2 నిందితుడిగా చేర్చడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం ప్రస్తుతం ఈ పరిణామం చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం.