
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానంలో భాగంగా.. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దని.. హోదానే కావాలని తీర్మానం చేస్తున్నామని జగన్ ప్రకటించారు. 59% శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా పొందామని.. అంతేకాకుండా విభజనలో మౌళిక సదుపాయాలు అతి తక్కువగా వచ్చాయన్నారు. హోదాపై నిర్ణయాధికారం కేంద్ర కేబినేట్ దేనని అన్నారు.
హోదా వల్ల ఏపీకి ఏమేం వస్తాయి..? ఏ విధంగా ఏపీ నష్టపోయింది..? అనే విషయాలపై సీఎం జగన్ నిశితంగా వివరించారు. హోదా అంశంపై ఇరు పక్షాలు ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. హోదా ప్రయోజనాలన్నీ కల్పిస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఈ సందర్భంగా సభకు బాబు వివరించారు. హోదాకు ఆర్థికసంఘం ఒప్పుకోలేదని.. పేరు మార్చి ప్యాకేజీ ప్రకటించారన్నారు. అంతేకాదు.. తాను హోదా విషయంలో ఎక్కడా రాజీపడలేదని.. 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్నారు.
ఈ మాటలకు స్పందించిన జగన్.. ఏపీకి హోదాపై యూపీఏ కేబినెట్ ఆమోదం తెలిపి ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు ఇచ్చిందన్నారు. జనవరి 2015 వరకు ప్లానింగ్ కమిషన్ ఉందని.. హోదాను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్ను కోరితే సరిపోయేదని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ ఉన్నా నాటి సీఎం చంద్రబాబు కనీసం లేఖ కూడా రాయలేదని జగన్ బాబుపై విమర్శలు గుప్పించారు.