
అల్వాల్, వెలుగు: మేడ్చల్ జిల్లా అల్వాల్లోని యాదమ్మ నగర్లో బుధవారం బీజేవైఎం జాతీయ ట్రెజరర్ టీమ్ సాయి ఆధ్వర్యంలో చేపట్టిన జాగో మల్కాజిగిరి యాత్ర ఉద్రిక్తంగా మారింది. వెయ్యి మంది బీజేవైఎం కార్యకర్తలు యాదమ్మ నగర్ నుంచి భూదేవినగర్, అల్వాల్, తెలుగు తల్లి చౌరస్తా, ఐజీ స్టాచ్యూ రోడ్, సెయింట్ మైకెల్ స్కూల్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్కారు స్థలాలు అన్యాక్రాంతమైన చోట, ఇవి ప్రభుత్వ భూములు అని రాసి బోర్డులు పాతారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులు మా భూములు కబ్జా చేశారంటూ సెయింట్ మైకేల్ స్కూల్ రాక్ ల్యాండ్ అవెన్యూ వద్ద కొందరు బాధితులు టీమ్ సాయి ప్రసాద్ను ఆశ్రయించారు. దీంతో బీజేవైఎం కార్యకర్తలు బుల్డోజర్తో రాక్ ల్యాండ్ ఎంట్రన్స్లో ఉన్న కమాన్ను కూల్చే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ.. బీజేవైఎం కార్యకర్తలు రాక్ ల్యాండ్ అవెన్యూ కార్యాలయ కమాన్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మైనంపల్లి అనుచరులు బీజేవైఎం కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
ALSO READ: పండరి స్వామి @ 37 చోరీలు ..
ఈ ఘటనలో కొంతమంది బీజేవైఎం కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైనంపల్లి అనుచరులే దాడి చేసినా బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అల్వాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే భూముల కబ్జాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. మైనంపల్లి అనుచరులకు పోలీసులు అండగా ఉండడంపై బీజేవైఎం నాయకులు మండిపడ్డారు.