గర్భిణి బంధువులతో   వైద్య సిబ్బంది అమానుష ప్రవర్తన

గర్భిణి బంధువులతో   వైద్య సిబ్బంది అమానుష ప్రవర్తన

జగిత్యాల, వెలుగు : ‘ఏమనుకుంటున్నవ్. ట్రీట్​మెంట్ ​చేస్తలేమని ఎమ్మెల్యేకు ఫోన్​ చేస్తవా?  అయితే ఆయనతోనే చేయించుకో’ అంటూ అత్యవసర పరిస్థితిలో వైద్యం అవసరమైన ఓ గర్భిణి బంధువుతో నిర్లక్ష్యంగా మాట్లాడిందో ఎంసీహెచ్​ నర్సు. డాక్టర్​ కూడా లేకపోవడంతో బాధితురాలిని వెంటనే ప్రైవేట్​ దవాఖానాకు తరలించారు. దీంతో తల్లీ, బిడ్డ ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పెర్ఫీ డెలివరీ కోసం ఈ నెల 18న జగిత్యాల ఎంసీహెచ్​లో( మాతా శిశు సంరక్షరణ కేంద్రం) లో చేరింది. మొదటి కాన్పు కావడంతో నార్మల్ డెలివరీ చేయాలని డాక్టర్లు, సిబ్బంది వేచి చూశారు. సోమవారం రాత్రి11:30 గంటలకు నొప్పులు రావడం, ఉమ్మనీరంతా పోవడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు.

డాక్టర్ ​అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఏదో ఒకటి చేసి కాపాడాలని అక్కడున్న నర్సును బతిమిలాడారు. ‘మాకు అన్నీ తెలుసు..మీరు చెప్తేనే చేస్తమా?’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడింది. దీంతో స్థానిక లీడర్ల సాయంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఫోన్ ​చేసి చెప్పారు. ఎమ్మెల్యే సూపరింటెండెంట్​కు ఫోన్​ చేసి తక్షణ వైద్య సాయం అందించాలని కోరారు. ఆయన దవాఖానాలో సిబ్బందికి ఫోన్​ చేసి వెంటనే ట్రీట్​మెంట్ ​చేయాలని ఆదేశించారు. దీనికి కోపం పెంచుకున్న అక్కడి నర్సు ‘ఎమ్మెల్యే తో ఫోన్ చేయిస్తారా? అయితే ఏంది? ఆయనతోనే ట్రీట్​మెంట్​ చేయించుకో’ అంటూ విసురుగా సమాధానమిచ్చారు. అదంతా పట్టించుకోవద్దని, ముందు వైద్యం చేయాలని కాళ్లు మొక్కినా వినలేదు. ఆమె ప్రాణం పోయే పరిస్థితి ఉండడంతో వెంటనే ఓ ప్రైవేట్ దవాఖానాకు తరలించారు. అక్కడ సిజేరియన్​చేయడంతో తల్లి, బిడ్డల ప్రాణాలు దక్కాయి. 

నాలుగు రోజుల క్రితం కూడా..

జగిత్యాల ఎంసీహెచ్​లో ఈ నెల 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బుగ్గారం మండలం చిన్నాపూర్ కు చెందిన గర్భిణి శైలజ 14వ తేదీన ఎంసీహెచ్​లో చేరింది. డాక్టర్లు చిన్న ఆపరేషన్ ​చేసి బేబీని బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కుట్లు వేసి మరుసటి రోజు డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో 17న మళ్లీ ఎంసీహెచ్​కు తీసుకువచ్చారు. స్కానింగ్​  ​చేయడంతో కుట్లు వేసేప్పుడు కాటన్ మర్చిపోవడంతోనే కడుపునొప్పి వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యిందని గుర్తించారు. వెంటనే కుట్లు విప్పి కాటన్ తొలగించారు.

ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించిన ఆమె భర్తపైనే డాక్టర్ ఫైర్​ అయ్యాడు. ఈ విషయం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని, దవాఖానా సిబ్బంది తీరుపై సమీక్ష చేస్తానని చెప్పారు. ఈ ఘటనలో నర్సు, ఆయాను బలి పశువును చేయాలని చూడగా.. అసలు బాధ్యులు వేరే ఉన్నారని, వారిపైనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త పట్టుబట్టాడు. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.