శంషాబాద్, వెలుగు: శంషాబాద్లో జీవో 111 సామాన్యులకు మాత్రమే వర్తిస్తుందా..? బడా బాబులకు వర్తించదా..? అంటూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్ ప్రశ్నించారు. శుక్రవారం సాతంరాయిలోని కాంగ్రెస్ ఆఫీసులో కౌన్సిలర్ సంజయ్ యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ మున్సిపల్ పరిధి ధర్మగిరి 103 సర్వే నంబర్లో జీవో 111కు వ్యతిరేకంగా ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపించారు. అదే సామాన్యుడు 100 గజాల్లో ఇంటి నిర్మాణం చేసుకుంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని మండిపడ్డారు.
ధర్మగిరిలో 800 గజాల్లో భారీ కట్టడాలు ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బడా బాబులు ఇచ్చే మామూళ్లకు తలోగ్గారా? అంటూ అధికారులను ఆయన ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గత అక్టోబర్లో శంషాబాద్ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేస్తే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, అక్రమ నిర్మాణదారులకు మద్దతుగా నిలుస్తున్నారని నరేందర్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రసాద్, పాపారావు, మహేందర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

