
ఇది జంపన్న వాగుపై చెక్డ్యామ్ల కత
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతర పనుల విషయంలో ప్రభుత్వ అధికారుల తీరు ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రభుత్వ నిధులను నీళ్లల్లో పోసినట్లే చేస్తున్నారు. జాతరకొచ్చే భక్తులు స్నానాలు చేయడానికి నీళ్లను నిల్వ చేయాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం రూ.12 కోట్లతో మూడు చెక్డ్యామ్లను నిర్మించారు. తీరా మహాజాతర ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండగా ఇప్పుడు అవే చెక్డ్యామ్ల వల్ల నీళ్లు ఎక్కువగా నిల్వ ఉంటున్నాయని కూల్చేస్తున్నారు. ఇందుకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. చిన్న నీటిపారుదల(ఐబీ శాఖ) అధికారులు ఎందుకు కడుతున్నారో.. ఎందుకు కూల్చేస్తున్నారో భక్తులకు తెలియని పరిస్థితి.
ఒక్కోటి రూ. 4 కోట్లతో నిర్మాణం
మేడారం జాతరకు వచ్చే ప్రతి భక్తుడు జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళతారు. జాతర సమయంలో మోకాలు లోతు నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జంపన్నవాగులో మూడుచోట్ల రూ.12 కోట్లతో 3 చెక్డ్యామ్లు నిర్మించింది. రెడ్డిగూడెం నుంచి ఊరట్టం వైపు వీటిని నిర్మించారు. కేవలం 2 కి.మీ దూరంలోనే మూడు చెక్డ్యామ్ల నిర్మాణం చేశారు. గత వేసవిలో పనులు జరిపారు. పనులు పూర్తయ్యి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రూ.4 కోట్ల విలువ చేసే చెక్డ్యామ్ ఒకటి దెబ్బతింది. ఆ నీటితో పక్కనే ఉన్న రైతుల పొలాల్లో మట్టి కొట్టుకుపోయింది.
చెక్డ్యామ్లు పగులగొట్టిన ఐబీ అధికారులు
జంపన్నవాగులో భక్తులు స్నానం చేయడానికి నీళ్లు నిల్వ చేయాలనే ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యామ్ల వల్ల నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అప్పటి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఐబీ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీటిని ఎందుకు కట్టారని కూడా ప్రశ్నించారు. లోతు తెలియక ఇప్పటికే చాలా మంది భక్తులు వాగులో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. మహాజాతర సందర్భంగా వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి కేవలం మోకాలు లోతు మాత్రమే నీళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. అవసరమైతే చెక్డ్యామ్లను కూల్చివేయండని ఆదేశాలిచ్చారు. దీంతో ఐబీ శాఖ అధికారులు రూ.30 లక్షల వరకు ఖర్చుచేసి మూడు చెక్డ్యామ్లను పగలగొట్టారు. నాసిరకం పనులతో వరదలకు కొట్టుకుపోయిన చెక్డ్యామ్ను సైతం పగలగొట్టారు.
సీసీకి బదులు మట్టితో నిర్మాణం
జంపన్నవాగులో ఏటా వరద ఎక్కువగా వస్తోంది. ఈ వరదను తట్టుకుని చెక్డ్యాం నిలబడాలి. అంటే వాగులో నిర్మించే చెక్డ్యామ్కు అటు.. ఇటు ఒడ్డు వైపు సీసీతో గోడ కట్టాలి. ఊరట్టం వైపు నిర్మించగా కొట్టుకుపోయిన చెక్డ్యామ్ వద్ద కుడివైపు సీసీతో గోడ కట్టిన కాంట్రాక్టర్ ఎడమవైపు కేవలం మట్టి పోసి వదిలేశారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చి చెక్డ్యామ్ దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. వరదకు చెక్డ్యామ్ దెబ్బతినడంతో వల్ల పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో పక్కనే ఉన్న రైతులకు సంబంధించిన 3 ఎకరాలు దెబ్బతిన్నాయి. ఎడమవైపున మట్టి కట్ట ఉండటంతో వరద అంతా పొలాల మీదుగా వెళ్లింది. దీంతో పెద్ద గొయ్యి పడి పొలాల్లో మట్టి కొట్టుకుపోయినట్లు అన్నదాతలు చెప్పారు. రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఖరీఫ్లో పంట సాగు
చేయలేకపోయారు.