
హైదరాబాద్: వరంగల్ జిల్లా కోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ అదాలత్లోని జిల్లా కోర్టులో బాంబ్ పెట్టామంటూ శుక్రవారం (జూన్ 20) మధ్యాహ్నాం గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన కోర్టుకు చేరుకున్నారు. కోర్ట్ ఆవరణలో బాంబ్ స్క్వాడ్, సుబేదారి స్టేషన్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
కోర్టు ప్రాంగణం మొత్తం ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే కోర్టు ఆవరణలో భద్రపరిచిన 6 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డిటోనేటర్లను ఆత్మకూరుకు చెందిన ఓ కేసు విషయంలో గతంలో స్వాధీనం చేసుకున్నవిగా గుర్తించారు. డిటోనేటర్లకు సంబంధించిన కేసు ఎప్పుడు కొట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ALSO READ | కేజీబీవీ గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తాజా బాంబ్ బెదిరింపు కాల్కు ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు, కోర్టు సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి కోసం గాలిస్తున్నారు. బాంబ్ బెదిరింపు కాల్తో జిల్లా కోర్టుకు వచ్చిన వారు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.