మహదేవపూర్, వెలుగు : జనమిలీషియా (మావోయిస్టు) సభ్యుడిని గురువారం రాత్రి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామ్రాఘడ్ సబ్ డివిజన్ ఏరియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గడ్చిరోలి జిల్లా బామ్రాగఢ్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు మావోయిస్టు పెకా మాదీ పుంగాటీగా గుర్తించారు. బామ్రాగఢ్ తాలూకా మిర్గులవంచనికి చెందిన అతడు మావోయిస్టుల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడని పోలీసులు తెలిపారు.
మావోయిస్టులకు రేషన్ అందించడం, మీటింగ్లకు ప్రజలను తరలించడం, మావోయిస్టుల వారోత్సవాల టైంలో బ్యానర్లు, కరపత్రాలు పంచడం వంటివి చేసేవాడని చెప్పారు. 2023లో హిదూర్ గ్రామం గోతుల్ సమీపంలో మూడు ట్రాక్టర్లు, జేసీబీని దగ్ధం చేసిన ఘటనలో, 2016లో ఓ పోలీస్ ఆఫీస్రను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలోనూ అతడు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని ఎస్పీ నీలోత్పల్ చెప్పారు. ఇతడిపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షల రివార్డు ప్రకటించిందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) యతీశ్ దేశ్ముఖ్ పాల్గొన్నారు.
