జనగామ/ జనగామ అర్బన్, వెలుగు: ఏండ్ల తరబడి వివాదంలో ఉన్న భూ సమస్యను ప్రజావాణిలోనే జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా పరిష్కరించారు. జనగామ మండలం శామీర్పేట్కు బడుక రాంచందర్కు సంబంధించిన 23 గుంటల భూమి కొన్నేండ్ల కింద అతడి అన్న కూతురు పేరుపై బదిలీ అయింది.
గత నెలలో నిర్వహించిన ప్రజావాణిలో రాంచందర్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించడంతో రికార్డులు పరిశీలించి అక్రమంగా బదిలీ అయిందని నిర్దారించి, విషయాన్ని కలెక్టర్కు తెలిపారు.
ఆయన వెంటనే భూమిని తిరిగి రాంచందర్ పేరుపై బదలాయించాలని ఆదేశించారు. వెంటనే 23 గుంటల భూమిని తిరిగి రాంచందర్కు బదలాయించారు. దీంతో కలెక్టర్ సందీప్కుమార్ ఝాను రాంచందర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సోమవారం ఒక్కరోజే 532 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ములుగు/ భూపాలపల్లి రూరల్/ ఖమ్మం టౌన్/ హనుమకొండ కలెక్టరేట్/ కాశీబుగ్గ/ భద్రాచలం , వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ములుగు గ్రీవెన్స్కు ప్రజల నుంచి 73 దరఖాస్తులు వ్చాయని కలెక్టర్ బోర్ఖడే హేమంత్సహదేవరావు తెలిపారు.
అనంతరం ఆయన భూభారతి, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, పింఛన్ల మంజూరుతోపాటు వివిధ అంశాలపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జయశంకర్భూపాలపల్లి ఐడీవోసీ ఆఫీస్లో నిర్వహించిన ప్రోగ్రామ్కు 66 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ఖమ్మంలో 100 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు.
హనుమకొండ కలెక్టరేట్ప్రజావాణిలో 263 మంది అర్జీలు అందజేశారని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. వరంగల్లో కలెక్టర్ సత్యశారద, భద్రాచలం ఐటీడీఏలో ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, సబ్ కలెక్టర్ ఆఫీసులో సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ నిర్వహించారు.
