మెడికల్​ కాలేజీ పనులు స్లో .. నత్తనడకన జనగామ మెడికల్​ కాలేజీ బిల్డింగ్ వర్క్స్​

మెడికల్​ కాలేజీ పనులు స్లో .. నత్తనడకన జనగామ మెడికల్​ కాలేజీ బిల్డింగ్ వర్క్స్​
  • నిర్మాణం ప్రారంభించి రెండేండ్లైనా ఎక్కడ పనులు అక్కడే 
  • మూడో ఏడాది తరగతులకూ తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు

జనగామ, వెలుగు : జనగామ ప్రభుత్వ మెడికల్​ కాలేజీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టి రెండేండ్లవుతున్నా నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో ఉన్న 18 ఎకరాల స్థలాన్ని కాలేజీకి కేటాయించారు. ఈ పనులు అప్పట్లోనే మొదలైనా నేటికీ ఊపందుకోవడం లేదు. మరో ఏడాది గడిచినా బిల్డింగ్​ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం మూడో ఏడాది తరగతులూ తాత్కాలిక భవనంలోనే కొనసాగనున్నాయి. 

పనులు వెరీ స్లో.. 

జిల్లా కేంద్రంలోని గీతాశ్రమం సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్​ కాలేజీ పనులు స్పీడందుకోవడం లేదు. రూ.200 కోట్లతో చేపడుతున్న ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. గత సర్కారు హయాంలో హౌజింగ్​ బోర్డుకు చెందిన స్థలం అయినప్పటికీ పట్టణ కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ స్థలాన్ని కాలేజీకి కేటాయించారు. రెండేళ్ల కింద నిర్మాణ పనులు ప్రారంభమైనా నేటికీ అందుబాటులోకి రాలేదు. ఆర్అండ్​బీ శాఖ పరిధిలో జరుగుతున్న ఈ పనుల పురోగతి మందగించింది. బిల్డింగ్​ నిర్మాణ ప్రాంతం చుట్టూ రేకులతో కంచె పెట్టడంతో పనులు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతానికి తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్​ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. 

తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు..

రెండేళ్ల కింద మెడికల్​కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయి. పక్కా బిల్డింగ్​అందుబాటులో లేకపోవడంతో జిల్లా కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపక్​హిల్స్​మాతా శిశు ఆస్పత్రి సమీపంలో రూ.60 కోట్లతో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. మొదటి, రెండో సంవత్సరం క్లాసులు వీటిలోనే నడుస్తున్నాయి. హాస్పిటల్​ బిల్డింగ్​లోని రెండో అంతస్థును పరిపాలన భవనంగా ఉపయోగిస్తున్నారు. ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేషన్​కు సంబంధించిన కొన్ని చాంబర్లు మాత్రమే ఉన్నాయి. 

వివిధ విభాగాల హెచ్​ఓడీలకు కనీసం చాంబర్లు కూడా లేవు. దీంతో సరైన పర్యవేక్షణ లేక వైద్యవిద్య గాడితప్పుతుందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు మహిళా స్టూడెంట్లకు చంపక్​హిల్స్ సుశీలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో, పురుషుల హాస్టల్​ను డీఆర్​డీఏ బిల్డింగ్ లో తాత్కాలికంగా రన్​చేస్తున్నారు. మరో నాలుగు నెలల్లో మూడో యేడాది క్లాసులు, హాస్టల్​ల నిర్వాహణకు బిల్డింగ్​ కోసం అన్వేషణ చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. కాలేజీ పక్కా బిల్డింగ్​ నిర్మాణం పూర్తైతేనే ఈ సమస్యలు తీరనున్నాయి.

పనుల పూర్తికి చర్యలు 

మెడికల్​ కాలేజీ పనులను వచ్చే డిసెంబర్​ వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నం. ప్రస్తుతానికి చంపక్​హిల్స్​లోని తాత్కాలిక షెడ్లలో మొదటి, రెండో ఏడాది తరగతులు నిర్వహిస్తున్నం. స్టూడెంట్లకు ఇబ్బందులు లేకుండా ఉన్నంతలో వసతులు కల్పిస్తున్నం. వచ్చే ఏడాది క్లాసుల నిర్వాహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తం. పక్కా బిల్డింగ్​ నిర్మాణం పూర్తైతే అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయి. 

దుగ్యాల గోపాల్​ రావు, ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్, జనగామ