
- నిర్మాణం ప్రారంభించి రెండేండ్లైనా ఎక్కడ పనులు అక్కడే
- మూడో ఏడాది తరగతులకూ తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు
జనగామ, వెలుగు : జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టి రెండేండ్లవుతున్నా నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో ఉన్న 18 ఎకరాల స్థలాన్ని కాలేజీకి కేటాయించారు. ఈ పనులు అప్పట్లోనే మొదలైనా నేటికీ ఊపందుకోవడం లేదు. మరో ఏడాది గడిచినా బిల్డింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం మూడో ఏడాది తరగతులూ తాత్కాలిక భవనంలోనే కొనసాగనున్నాయి.
పనులు వెరీ స్లో..
జిల్లా కేంద్రంలోని గీతాశ్రమం సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు స్పీడందుకోవడం లేదు. రూ.200 కోట్లతో చేపడుతున్న ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. గత సర్కారు హయాంలో హౌజింగ్ బోర్డుకు చెందిన స్థలం అయినప్పటికీ పట్టణ కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ స్థలాన్ని కాలేజీకి కేటాయించారు. రెండేళ్ల కింద నిర్మాణ పనులు ప్రారంభమైనా నేటికీ అందుబాటులోకి రాలేదు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరుగుతున్న ఈ పనుల పురోగతి మందగించింది. బిల్డింగ్ నిర్మాణ ప్రాంతం చుట్టూ రేకులతో కంచె పెట్టడంతో పనులు ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతానికి తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
తాత్కాలిక ఏర్పాట్లే దిక్కు..
రెండేళ్ల కింద మెడికల్కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయి. పక్కా బిల్డింగ్అందుబాటులో లేకపోవడంతో జిల్లా కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపక్హిల్స్మాతా శిశు ఆస్పత్రి సమీపంలో రూ.60 కోట్లతో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. మొదటి, రెండో సంవత్సరం క్లాసులు వీటిలోనే నడుస్తున్నాయి. హాస్పిటల్ బిల్డింగ్లోని రెండో అంతస్థును పరిపాలన భవనంగా ఉపయోగిస్తున్నారు. ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన కొన్ని చాంబర్లు మాత్రమే ఉన్నాయి.
వివిధ విభాగాల హెచ్ఓడీలకు కనీసం చాంబర్లు కూడా లేవు. దీంతో సరైన పర్యవేక్షణ లేక వైద్యవిద్య గాడితప్పుతుందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు మహిళా స్టూడెంట్లకు చంపక్హిల్స్ సుశీలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో, పురుషుల హాస్టల్ను డీఆర్డీఏ బిల్డింగ్ లో తాత్కాలికంగా రన్చేస్తున్నారు. మరో నాలుగు నెలల్లో మూడో యేడాది క్లాసులు, హాస్టల్ల నిర్వాహణకు బిల్డింగ్ కోసం అన్వేషణ చేపట్టక తప్పని పరిస్థితి నెలకొంది. కాలేజీ పక్కా బిల్డింగ్ నిర్మాణం పూర్తైతేనే ఈ సమస్యలు తీరనున్నాయి.
పనుల పూర్తికి చర్యలు
మెడికల్ కాలేజీ పనులను వచ్చే డిసెంబర్ వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నం. ప్రస్తుతానికి చంపక్హిల్స్లోని తాత్కాలిక షెడ్లలో మొదటి, రెండో ఏడాది తరగతులు నిర్వహిస్తున్నం. స్టూడెంట్లకు ఇబ్బందులు లేకుండా ఉన్నంతలో వసతులు కల్పిస్తున్నం. వచ్చే ఏడాది క్లాసుల నిర్వాహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తం. పక్కా బిల్డింగ్ నిర్మాణం పూర్తైతే అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయి.
దుగ్యాల గోపాల్ రావు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, జనగామ