
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్న క్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ ఫాం హౌస్కు వెళ్లారు. అయితే.. కేసీఆర్ ఫాం హౌస్లో ప్రమాదవశాత్తూ రాజేశ్వర్ రెడ్డి జారి పడ్డారు. దీంతో.. ఆయనను హుటాహుటిన ఆయనను అంబులెన్స్లో యశోదా ఆసుపత్రికి తరలించారు. ఫాం హౌస్లో పల్లా స్వల్ప అస్వస్థతకు గురవడంతో జారి పడ్డారని తెలిసింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ బుధవారం నిర్వహించే క్రాస్ఎగ్జామినేషన్కు హాజరుకానున్నారు. ఉదయం 11.30 గంటల లోపు బీఆర్కే భవన్ చేరుకోనున్న కేసీఆర్.. ఓపెన్ కోర్టులో పాల్గొంటారా? లేదంటే ఇన్ కెమెరా ఎంక్వైరీ కోరుకుంటారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
కాళేశ్వరం నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న అందరు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బుధవారం కేసీఆర్ను క్రాస్ఎగ్జామినేషన్ చేయనుండగా, కమిషన్ ఏయే ప్రశ్నలు వేస్తుంది? దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి? అనే ఉత్కంఠ నెలకొన్నది.