ఎరుపెక్కిన జీడిమెట్ల నాలాలు..కెమికల్ వ్యర్థాలు కలుపుతున్న ఫ్యాక్టరీలు

ఎరుపెక్కిన జీడిమెట్ల నాలాలు..కెమికల్ వ్యర్థాలు కలుపుతున్న ఫ్యాక్టరీలు
  • వర్షం మాటున ప్రమాదకర వ్యర్థ జలాల డంపింగ్​   
  • ఈసారి ఏకంగా డ్రమ్ములతోనే..
  • ఘాటైన వాసనలు, పొగలతో ఉక్కిరిబిక్కిరి 

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియాలోని నాలాలు శుక్రవారం ఎరుపెక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు వర్షాన్ని ఆసరాగా చేసుకుని వ్యర్థ రసాయనాలు కలపడంతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ నాలాలు ఎర్ర రంగులో కనిపించాయి. జీడిమెట్ల, ఎస్వీ కోపరేటివ్​సొసైటీ ఇండస్ట్రియల్​ఏరియాలోని కొన్ని కంపెనీలు, కెమికల్​మాఫియా చేతులు కలిపి మూడు రోజులుగా వర్షం మాటున పెద్ద ఎత్తున ప్రమాదకర వ్యర్థ రసాయనాలను నాలాలో డంప్​చేస్తున్నాయి. 

ప్రతిసారీ ఈ పని చేస్తున్నా ఈసారి బరి తెగించి ఏకంగా కెమికల్​డ్రమ్ములనే తీసుకువచ్చి పడేశారు. ఆ డ్రమ్ముల్లోంచి పొగలు వస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గంపల బస్తీ వాసులైతే ఘాటైన వాసనలు, పొగలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

 ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? 

సాధారణంగా కంపెనీల్లో ప్రొడక్షన్​తర్వాత వెలువడే ప్రమాదకర వ్యర్థ రసాయనాలను ట్రీట్​మెంట్​ప్లాంట్లకు తరలించాలి. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొన్ని పరిశ్రమల యజమానులు నాలాల్లోకి డంప్​చేస్తున్నారు. సాధారణ సమయాల్లో ట్యాంకర్ల ద్వారా ఖాళీ ప్రదేశాల్లో డంప్​చేస్తుండగా, వర్షాకాలంలో నాలాలను వాడుకుంటున్నారు. కొందరైతే డైరెక్ట్​గా పైపు లైన్లు వేసి  రసాయనాలను వదులుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.