- 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు తొలిదశ ఎన్నికలు
రాంచి: జార్ఖండ్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆరు జిల్లాల్లోని 13 సెగ్మెంట్లకు శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. 64.12 శాతం ఓటింగ్ నమోదైనట్లు జార్ఖండ్ సీఈవో వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు. పోలింగ్ సందర్భంగా బిష్ణుపూర్లో నక్సల్స్ బ్రిడ్జిని పేల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని, మరికొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు వివరించారు. కొద్ది రోజుల కిందటే మావోయిస్టుల దాడులు జరిగిన లతేహర్, మణిక జిల్లాల్లో సెక్యూరిటీ టైట్ చేశామని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్గా పోటీకి దిగింది. దాని మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ కూడా ఒంటరిగానే బరిలో నిలిచింది. ప్రతిపక్షాలు రాష్ట్రీయ జనతా దళ్, జార్ఖంఢ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోరాడుతున్నాయి.