రాంచీ: రాంచీలోని గడిఖానా చౌక్లో ఉన్న 2BHK ఫ్లాట్లో సోమవారం ఈడీ అధికారు దాడులు చేశారు. మే 6న రాంచీలో జరిగిన దాడిలో రూ. 35 కోట్లకుపైగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రెటరీ సంజీవ్ లాల్, ఆయన ఇంటి పనిమనిషిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మంత్రి ఆలం ఆ డబ్బుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. సోమవారం రాత్రి వరకు సంజీవ్ లాల్, ఆయన పనిమనిషిని ఈడీ అధికారులు విచారించారు. రైడ్స్ లో దొరికిన డబ్బుకు లెక్కలు చెప్పనందుకు వారిద్దరిని మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు.
రాంచీలోని గడీఖానా చౌక్లోని ఒక బిల్డింగ్లోని ఓ పోర్షన్లో కొన్ని బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలను పట్టుకున్నట్టు చెప్పారు. అది జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ వద్ద హౌస్కీపర్ గా పనిచేస్తున్న వ్యక్తిదిగా గుర్తించారు. ఆలం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు పట్టుబడడంపై ఆలంను మీడియా ప్రశ్నించగా.. ‘‘దానికి సంబంధించి నాకు అధికారిక సమాచారం లేదు. టీవీలో చూస్తున్నాను, డబ్బులు దొరికిన నివాసం ప్రభుత్వం నాకు కేటాయించిన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్కు సంబంధించింది. అతను ప్రభుత్వ ఉద్యోగి. గతంలో ఇద్దరు మంత్రులకు పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. అనుభవం ఆధారంగా ప్రభుత్వం పర్సనల్ సెక్రటరీలను నియమిస్తుంది. ఈడీ ఎంక్వైరీ కంటే ముందు కామెంట్ చేయడం సరికాదు” అని అన్నారు.