క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన జేఎన్టీయూ

క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన జేఎన్టీయూ

హైదరాబాద్: విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ పై జేఎన్టీయూ వెనక్కి తగ్గింది. ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. కరోనాతో రెండేళ్లుగా క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది నుంచి క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించినట్లు ఈ నెల ప్రారంభంలో జేఎన్‌టీయూ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించకపోతే విద్యార్థులు మరుసటి సంవత్సరానికి ప్రమోట్‌ అయ్యేందుకు వీలుండదని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ నిర్ణయంపై మడ్డిపడ్డ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్రెడిట్ బేస్ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన యూనివర్సిటీ అధికారులు డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏంటీ క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం? 

జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ఏటా నిర్దేశిత క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అలాగే 75 శాతం  హాజరు ఉంటేనే సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. కరోనాతో రెండేళ్లు హాజరుతో పాటు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్, రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యా్ర్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించలేకపోతే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు.