- ఇటలీలో జరిగిన ప్రోగ్రామ్లో పాల్గొన్న ఆయన కొడుకు మను
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆరు సార్లు లోక్సభ ఎంపీగా గెలిచి, పీవీ నరసింహారావు హయాంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా, రైల్వే , పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసిన డాక్టర్ మల్లికార్జున్ కు అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రపంచంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇటలీలోని బొలోనియాలో ఉన్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్సుడ్ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్) క్యాంపస్లో కొత్తగా నిర్మించిన టెర్రస్కు ఆయన పేరు పెట్టారు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి వైద్య పరిశోధనలో ముందంజలో ఉంది. డాక్టర్ మల్లికార్జున్ హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మెడిసిన్చేశారు. ఆయన కొడుకు మను మల్లికార్జున్ కూడా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్)లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఏ పూర్తి చేశారు. క్యాంపస్లో జరిగిన శిలా ఫలకావిష్కరణకు మను మల్లికార్జున్ హాజరయ్యారు.
స్టూడెంట్ లీడర్ నుంచి కేంద్ర మంత్రి దాకా..
1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా జెండా పట్టిన మల్లికార్జున్.. అంచెలంచెలుగా ఎదిగి ఆరు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. మెదక్ నుంచి రెండు సార్లు, పాలమూరు (మహబూబ్నగర్) నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచి తనదైన ముద్ర వేశారు.
