
న్యూఢిల్లీ: నగల కంపెనీ జోయాలుక్కాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశ విదేశాల్లో 30 షోరూమ్లు తెరవనుంది. ఇందుకోసం దాదాపు రూ. 2,400 కోట్ల పెట్టుబడులు పెడతామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఐపీఓకు కూడా సిద్ధమవుతోందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం జోయాలుక్కాస్కు భారతదేశంలో 100 షోరూమ్లు, పది దేశాల్లో 60 ఔట్లెట్లు ఉన్నాయి. "మా కార్యకలాపాలను భారతదేశంతో పాటు విదేశాలలో విస్తరించే పనిలో ఉన్నాం. మేం భారతదేశంలో 30 కొత్త షోరూమ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే 2024–-25, 2025-–26 ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం వెలుపల పది షోరూమ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని జాయ్ అలుక్కాస్ చెప్పారు. ఒక్కో షోరూమ్పై కంపెనీ సగటున రూ.60 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఆయన చెప్పారు.
ఉత్తర భారతదేశంలో ఎక్కువ షోరూమ్లను తెరుస్తామని, కెనడా, ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలలో పది స్టోర్లను ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. పెట్టుబడులు అంతర్గత నిల్వలు, బ్యాంకు లోన్ల నుంచి సేకరిస్తామని, షోరూమ్లు పూర్తిగా కంపెనీ యాజమాన్యంలో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కంపెనీ 2011, 2022లో ఐపీఓకి వెళ్లడానికి రెండుసార్లు ప్రయత్నించింది. మార్కెట్ అనుకూలంగా లేనందున కంపెనీ 2011లో ఐపీఓని తీసుకురాలేకపోయింది. అయితే 2022లో రెగ్యులేటరీ ఆమోదంలో జాప్యం జరిగింది. అప్పటికి కంపెనీ వాల్యుయేషన్ మెరుగుపడింది.