
- కౌన్సెలింగ్తో సమస్యకు పరిష్కారం
నిర్మల్, వెలుగు: మెట్లెక్కలేని ఓ వృద్ధుడికి సహకరించేందుకు మూడంతస్తులపై ఉన్న కోర్టు భవనం నుంచి జడ్జి దిగి వచ్చి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఏండ్ల సమస్యకు పరిష్కారం చూపారు. 2022లో దిలావర్పూర్ మండలం మాడేగాం గ్రామంలో ఓ కేసు నమోదు కాగా, దాని విచారణ మంగళవారం నిర్మల్ కోర్టులో జరిగింది. ఇందులో ఫిర్యాదుదారుడు లింగోళ్ల భీమలింగు(61) కోర్టుకు వచ్చాడు.
మోకాళ్ల నొప్పులుండడంతో మూడో అంతస్తులో ఉన్న కోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డాడు. కోర్టు కానిస్టేబుల్ ప్రభాకర్ న్యాయమూర్తి భవిష్య దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె కిందికి దిగివచ్చి భీమలింగుతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధుడి వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించిన జడ్జి జోగినపల్లి భవిష్యను పలువురు అభినందిస్తున్నారు.