బైక్​పై తరలిస్తున్న..8 కిలోల గంజాయి పట్టివేత

బైక్​పై తరలిస్తున్న..8 కిలోల గంజాయి పట్టివేత

చండ్రుగొండ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జూలూరుపాడు పోలీసులు గురువారం పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. చండ్రుగొండ లోని  సాయికృష్ణ పెట్రోల్ బంక్ వద్ద  బుధవారం రాత్రి  జూలూరుపాడు ఎస్సై పురుషోత్తం ఆధ్వర్యంలో  పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో కొత్తగూడెం నుంచి ఎర్రగుంట వైపు వెళ్తున్న పల్సర్ బైక్ ను ఆపి తనిఖీ చేశారు. రూ.1.60 లక్షల విలువైన 8 కిలోల గంజాయి ప్యాకెట్లు దొరికాయి. దీంతో బైక్​పై ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.

నిందితులు ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా పులివెందుల మండలాలనికి  చెందిన గణేశ్, చిత్తూరు జిల్లా కు చెందిన  గోపి మంజునాథ్​గా గుర్తించారు. గంజాయిని చిత్తూరుకు తీసుకెళ్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. వారి నుంచి పల్సర్ బైక్, రెండు సెల్ ఫోన్లు , గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కొత్తగూడెం కోర్డులు హాజరుపర్చినట్టు సీఐ తెలిపారు.  గంజాయి పట్టివేతకు సహకరించిన  హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, కానిస్టేబుల్స్ శివశంకర్, రాంబాబును సీఐ అభినందించారు.