
హైదరాబాద్, వెలుగు: కలెక్టర్, సీడబ్ల్యూసీ ఆఫీసర్ల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని జూనియర్ ఆర్టిస్ట్కరాటే కళ్యాణి వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడితో వివాదాస్పదమైన కళ్యాణి మంగళవారం అబిడ్స్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసుకి వచ్చారు. ఆమెతో 5 నెలల చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారు. కాగా ఆఫీసులో అధికారులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. చిన్నారిని ఇల్లీగల్గా దత్తత చేసుకున్నానని జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు. చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఓ యూట్యూబ్ చానెల్లో వెల్లడించిన సంగతి నిజమేనని చెప్పారు. చిన్నారికి ఏడాది నిండిన తరువాత లీగల్గా దత్తత చేసుకునేందుకు పాప తల్లిదండ్రులకు ఆశ్రయం ఇచ్చానని తెలిపారు. బుధవారం చెల్డ్ వెల్ఫేర్ఆఫీసర్లను కలిసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు హైదరాబాద్ కలెక్టర్శర్మన్ను కళ్యాణి కలిసి మాట్లాడారు.