- హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్
నల్గొండ అర్బన్, వెలుగు: న్యాయవ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ చెప్పారు. ఆదివారం నల్గొండలోని ఎంజీయూలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా న్యాయవాదులకు నిర్వహించిన శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కుటుంబ విభేదాలు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కేసులు, వ్యక్తిగత సమస్యల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించ గలిగే అవకాశం ఉందన్నారు. కోర్టుల్లో పెరిగిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, మధ్యవర్తితం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.
ఇది సమయం ఆదా చేయడమే కాకుండా, తక్కువ వ్యయంతో అందించే పద్ధతి అని, మధ్యవర్తిత్వంలోని ప్రధాన లక్ష్యం వివాదంలో గెలుపు ఓటమి కాదని పరస్పర అంగీకారంతో పరిష్కారం కనుక్కోవడమన్నారు. న్యాయవాదులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, నైపుణ్యం కలిగిన శిక్షకులు ఉన్నారని, వారు చెప్పే అంశాలను ప్రతీది నోట్ చేసుకోవాలని, కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కోరారు.
అంతకు ముందు ఎంజీయూలో అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి హైకోర్టు జడ్జికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్టర్ మీడియేషన్ అండ్ అబ్జర్వేషన్ సెంటర్ హైదరాబాద్ పంచాక్షరి, నల్గొండ యాదాద్రి జిల్లాల జడ్జిలు కవిత, జయరాజు పురుషోత్తం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంత రెడ్డి, నాంపల్లి, నరసింహ, న్యాయవాదులు పాల్గొన్నారు.
