హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో మైనారిటీలను బీఆర్ఎస్ కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నదని కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ విమర్శించారు. శనివారం ఆయన కాంగ్రెస్ రాష్ట్ర కమ్యూనికేషన్స్ ఇన్చార్జి అజయ్ ఘోష్తో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించడంతో బీఆర్ఎస్కు భయం పట్టుకుందన్నారు.
రాష్ట్రంలో 77 వేల ఎకరాల వక్ఫ్ భూములుంటే, 54 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ధ్వజమెత్తారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014లో ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఆ బిల్లును కూడా ఆమోదించలేదని దుయ్యబట్టారు. జామా మసీదు మరమ్మతుల కోసం రూ.2.30 కోట్లు కేటాయించిన కేసీఆర్ సర్కారు.. అందులో కేవలం రూ.2 లక్షలే విడుదల చేసిందని మండిపడ్డారు.