- నిర్ధారించిన జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ సభ్యులు
- మేడారంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో విచారణ బృందం భేటీ
ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్ వైరల్ న్యూస్ కు తెరపడింది. ఓ యూట్యూబ్ చానెల్ లో వైరల్ అయిన ఈ న్యూస్ను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయ రహత్కర్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఎంక్వైరీ కమిషన్ సభ్యులు గురువారం ములుగు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. గ్యాంగ్ రేప్ జరగలేదని, అది ఫేక్ న్యూస్గా తేల్చారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో ఈనెల 29న జంపన్నవాగు పరిసరాల్లోని ఓ మామిడి తోటలో 13 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ డాక్టర్ సుధీర్ రాంనాథ్ కేకన్ స్పందించారు. విచారణ జరిపి అది ఫేక్ న్యూస్గా నిర్ధారించారు. వైరల్ చేయవద్దని ప్రకటించారు. అయితే జాతీయ మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ కమిటీ వేసింది. మహిళా కమిషన్ సభ్యులు డెలినా ఖోంగ్డప్, కాంచన్ ఖట్టర్ ఢిల్లీ నుంచి ములుగుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో సమావేశమై ఆరా తీశారు.
కమిషన్కు రిపోర్టు అందజేయనున్న సభ్యులు
ములుగు కలెక్టరేట్లో పలు అంశాలపై చర్చించిన అనంతరం ఎన్సీడబ్ల్యూ ఎంక్వైరీ కమిటీ సభ్యులు తాడ్వాయి మండలంలోని మేడారం వెళ్లారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లు ప్రచారం జరిగిన ప్రాంతాల్లో ఆర్డీఓ వెంకటేశ్ సారథ్యంలో సభ్యులు పర్యటించారు. స్థానికులను సైతం విచారించారు. అదేవిధంగా పస్రా సీఐ దయాకర్, ఎస్సై కమలాకర్ విచారణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గ్యాంగ్రేప్ అంటూ వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని నిర్ధారణకు వచ్చిన కమిటీ సభ్యులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్ చానెల్లో వచ్చిన న్యూస్తో ఎంక్వైరీకి వచ్చామని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక గ్యాంగ్ రేప్ జరగలేదని నిర్ధారణకు వచ్చామని కమిటీ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్ వెల్లడించారు. ట్యూబ్ చానెల్ సైతం వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్పిందని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని, అనంతరం లిఖితపూర్వక రిపోర్టును జాతీయ మహిళా కమిషన్కు నివేదిస్తామన్నారు.
