పాప్ సింగర్ హేసూ కన్నుమూత..  హోటల్​ గదిలో విగతజీవిగా

పాప్ సింగర్ హేసూ కన్నుమూత..  హోటల్​ గదిలో విగతజీవిగా

ఈ మధ్య కాలంలో కే పాప్​ సింగర్ల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గత నెల 19న ఆస్ట్రో బ్యాండ్ కు చెందిన ప్రముఖ కే పాప్​ స్టార్​ మూన్​బిన్ చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేయగా...  ఇప్పుడు  ప్రముఖ కొరియన్​ పాప్ (కే-పాప్​)​ సింగర్​ హేసూ (29) సోమవారం ( మే 15)కన్నుమూశారు.

హోటల్​ గదిలో విగత జీవిగా

తన  పాటలతో సంగీత ప్రియులను, శ్రోతలను అలరించిన ప్రముఖ కొరియన్​ పాప్ (కే-పాప్​)​ సింగర్​ హేసూ  దక్షిణ కొరియా జియోల్లబుక్​-డో ప్రావిన్స్​లోని వాంజుగన్​ కౌంటీలోని తన హోటల్​ గదిలో విగత జీవిగా కనిపించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆమె మృతదేహం వద్ద  ఓ సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మే 20 షెడ్యూల్​ అయిన ఓ ఈవెంట్ కోసం వాంజుగన్​ చేరుకున్నారు హైసూ. ఈ క్రమంలోనే అక్కడి హోటల్ గదిలో బస చేసిన ఆమె.. విగత జీవిగా కనిపించారు. ఈ విషయాన్ని గుర్తించిన అక్కడి సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు.. పోలీసులకు సమాచారమిచ్చారు.
 

కాగా, 1993లో జన్మించిన హేసూ.. ‘మై లైఫ్​, మీ’ అనే ఆల్బమ్​తో 2019లో కే పాప్​లోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత గాయో స్టేజ్​, హ్యంగౌట్​ విత్​ యూ, ది ట్రోట్ షో లాంటి కార్యక్రమాల్లో పాడి ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు. అలా తన అద్భుతమైన​ పాటలతో, గాత్రంతో అభిమానులను సంపాదించుకున్నారు. హేసూ తన మరణానికి ముందు రోజు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. రోజూ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కమ్యూనికేట్ చేసింది.యువ కె-పాప్ స్టార్ మరణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం తెలిపారు . ఇంత చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న సింగర్ చనిపోవడంతో ఆయన అభిమానులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.