న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు దొంగ కావాలంటే కేసీఆర్ను, గజదొంగ కావాలంటే రేవంత్ రెడ్డిని ఎన్నుకోవాలని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి ఓటేసిన అది బీఆర్ఎస్కి వేసినట్లేనని విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మందుకొట్టి కొత్త మేనిఫెస్టో తెస్తానని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సహాయంతో రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్లో ప్రజా శాంతి పార్టీ సభకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు.
త్వరలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 119 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, ఇప్పటి వరకు టికెట్ల కోసం 3,600 మంది అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపారు. ఆ లిస్ట్లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారని చెప్పారు.