జీడిమెట్ల, వెలుగు: సీఎం కేసీఆర్ కార్మికుల శ్రేయస్సు కోరేవాడైతే సూపర్మ్యాక్స్ కార్మికులను ఆదుకోవాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్డిమాండ్ చేశారు. సీఎం ఒక్క ఫోన్ కాల్తో కంపెనీ ఓపెన్ చేయించి కార్మికులను ఆదుకోవచ్చన్నారు. కేసీఆర్ సర్కార్ స్పందించకపోతే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని సూపర్మ్యాక్స్ కంపెనీని వారం రోజుల్లో తెరిపిస్తానని కేఏ పాల్ చెప్పారు. కాగా, సుమారు వెయ్యిమంది సూపర్మ్యాక్స్ కార్మికులు కొన్ని నెలలుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. వారికి ఆయన శనివారం సంఘీభావం తెలిపారు. అనంతరం పాల్ మాట్లాడుతూ కంపెనీ అర్ధంతరంగా వెయ్యిమంది కార్మికులను తొలగిస్తే వారి కుటుంబాలు ఏమవుతాయని ప్రశ్నించారు. కార్మికులు తమ ఇంటి అద్దెలు, వాహనాల ఈఎంఐలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కంపెనీ మూత పడుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.