
- పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు
- కోల్బెల్ట్ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర
- 17 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇప్పంచి ఆరాధ్యదైవమైన కాకా
గోదావరిఖని : గుడిసెవాసుల గుండెల్లో దీపమై వెలుగుతున్న మహనీయుడు కాకా. రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరుగాంచిన గడ్డం వెంకటస్వామి (కాకా) తన తుది శ్వాస వరకు కార్మిక పక్షపాతిగానే పనిచేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని సింగరేణి, ఇతర పరిశ్రమల ఉద్యోగులు, కార్మికుల కోసం అయన ఎనలేని సేవలందించి వారిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
1984 నుంచి పెద్దపల్లి ఎంపీగా....
కాకా వెంకటస్వామికి మొదటి నుంచి రామగుండం ప్రాంతంతో అనుబంధం ఉంది. రామగుండం జెన్ కో విద్యుత్ కర్మాగారం నిర్మాణ సమయంలో అవసరమైన కలప సరఫరా చేసే కాంట్రాక్టు పనులు చేపట్టిన ఆయన ఆ తర్వాత రామగుండం ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐఎన్టీయూసీలో కీలక నేతగాగా పనిచేస్తూ 1957లో మొదటి ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట లోక్ సభ సభ్యుడిగా 1967, 1971, 1977లో మూడు సార్లు గెలిచిన వెంకటస్వామి ఆ తర్వాత నుంచి పెద్దపల్లి ఎంపీగా 1984 నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అలా 1991, 1996, 2004లో పెద్దపల్లి ఎంపీగా నాలుగు పర్యాయాలు ఇక్కడి ప్రజలు గెలిపించారు. ఈ సమయంలోనే ఆయన 1991లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా, 1993లో కేంద్ర జౌళి శాఖ (స్వతంత్ర హోదా) మంత్రిగా వ్యవహరించారు. 2004లో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.
సింగరేణి కార్మికులతో విడదీయరాని బంధం...
1990లో సింగరేణిలో ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో సంస్థ మూతపడే స్థితికి వచ్చింది. సంస్థను బోర్డు ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఫైనాన్షియల్ రీ కన్ స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్)కు రెఫర్ చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న వెంకటస్వామి చొరవ తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ టీ పీ సీ తో మాట్లాడి రూ.450 కోట్ల రుణాన్ని సింగరేణికి ఇప్పించారు. ఈ పరిణామంతో సింగరేణి సంస్థ నిలదొక్కుకుని 1999 నాటికి లాభాల బాటలోకి వచ్చింది.
ఆనాడు వెంకటస్వామి చొరవ తీసుకోకపోతే సింగరేణి సంస్థ మూసివేసిన ప్రభుత్వ రంగ పరిశ్రమల జాబితాలోకి చేరిపోయేది. సింగరేణిలో పనిచేస్తున్న లక్షా 20 వేల మంది ఉద్యోగాలను కాపాడారు. 1993లో కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా వెంకటస్వామి వ్యవహరించిన సమయంలో భూగర్భంలోకి వెళ్ళి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే 1995లో బొగ్గు గని కార్మికులకు ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్ అమలు చేయించారు. దీంతోనే సింగరేణితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2006లో సింగరేణి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రాజెక్ట్ ను నెలకొల్పేలా చొరవ తీసుకున్నారు. నేడు 1200 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ అగ్రగామిగా నిలిచింది. కోల్మైన్స్ప్రావిడెంట్ఫండ్కార్యాలయం హైదరాబాద్లో ఉండడంతో ఏ అవసరమున్నా కార్మికులు అక్కడికి వెళ్లి రావడం వ్యయప్రయాసాలతో కూడుకుని ఉండేది.
ఈ క్రమంలో గని కార్మికులకు దూరంగా హైదరాబాద్ లో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని గోదావరిఖనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. 2009లో గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి స్థలాలను ఆక్రమించుకుని ఇండ్లు నిర్మించుకున్న వారిలో సుమారు 17 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించడంలో కాకా వెంకటస్వామి విశేష కృషి చేశారు.
ఎన్కౌంటర్మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు
1994 జనవరి నెలలో అప్పటి ఉమ్మడి రామగుండం మండలం పాలకుర్తి గ్రామంలో ఎన్కౌంటర్జరిగింది. పోలీస్కాల్పుల్లో 11 మంది మరణిస్తే అందులో ఆరుగురు గ్రామస్తులున్నారు. వారంతా దళితులు. ప్రభుత్వంతో మాట్లాడి ఆరుగురు మృతుల భార్యలకు ఈఎస్ఐలో ఉద్యోగాలు ఇప్పించారు. కాకా తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఆ కుటుంబాలకు ఆసరా దొరికింది.
ఎరువుల కర్మాగారం తెరిపించడానికి విశేష కృషి...
రామగుండంలో నష్టాల కారణంగా మూసివేసిన ‘అన్నపూర్ణ’ ఎరువుల కర్మాగారాన్ని తెరిపించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడారు. 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన కాకా కుమారుడు వివేక్ కూడా రామగుండం ఎరువుల కర్మాగారంను తెరిపించేందుకు విశేష కృషి చేశారు. ఈ కర్మాగారానికి ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలను ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడి మాఫీ చేసేవిధంగా ఒప్పించారు.
దీంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని బీఐఎఫ్ఆర్ లోని ఖాయిలా పడిన పరిశ్రమల జాబితా నుంచి తొలగించారు. ఆనాడు కాకాతో పాటు ఆయన వివేక్ చూపిన చొరవ వల్లనే నేడు రామగుండం ఎరువుల కర్మాగారం రూ.6,500 కోట్లతో పునరుద్దరణకు నోచుకుంది. రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ గా పేరు మార్చుకుని నేడు యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రత్యేకంగా ‘రామగిరి’ ట్రైన్
కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు, కార్మికులకు ఉపయోగపడే విధంగా సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ వరకు ప్రత్యేకంగా ‘రామగిరి ఎక్స్ప్రెస్’ ట్రైన్ను కాకా వెంకటస్వామి వేయించారు. అది నేటికి నడుస్తున్నది. అలాగే చెన్నూర్, మహాదేవపూర్లో అతిపెద్ద బీఎస్ఎన్ఎల్ టవర్స్ వేయించారు. హుజురాబాద్ వద్ద గల కోతులనడుమ గ్రామంలో పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేయించారు. కాకా ఆధ్వర్యంలో మంచిర్యాలలో, వివేక్ ఆధ్వర్యంలో రామగుండంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగింది.