
చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని చేవెళ్ల సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. బుధవారం చేవెళ్ల సెగ్మెంట్ పరిధి నవాబ్ పేట మండలం పులుమామిడి, లింగంపల్లి, గొల్లగూడ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గొల్లగూడ గ్రామంలో డప్పు వాయిద్యాలు, కోలాటాలతో గొల్ల, కురుమలు యాదయ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తుందన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని యాదయ్య కోరారు. మొయినాబాద్ మండలంలో ఇయ్యాల జరగనున్న కేటీఆర్ రోడ్ షోను సక్సెస్ చేయాలని కాలె యాదయ్య పిలుపునిచ్చారు.