విజిలెన్స్​, ఎన్​డీఎస్ఏ రిపోర్ట్స్​ ఇవ్వండి.. ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ లేఖ

విజిలెన్స్​, ఎన్​డీఎస్ఏ  రిపోర్ట్స్​ ఇవ్వండి.. ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ లేఖ
  • నివేదికపై కమిషన్ కసరత్తు... 
  • అధికారుల స్టేట్​మెంట్లు, డాక్యుమెంట్ల పరిశీలన
  • విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను 
  • పిలిచే విషయంపై ఇంకా రాని క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ తుది దశకు చేరుకుంది. అధికారులందరినీ విచారించిన కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​.. రిపోర్టుపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. శనివారం హైదరాబాద్​కు వచ్చిన ఆయన.. వారంపాటు ఇక్కడే ఉండనున్నారు. కమిషన్ ​నివేదికను సిద్ధం చేస్తున్నారు. అందుకు రిపోర్టులో ఏమేం పెట్టాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా ఇప్పటిదాకా ఇంజినీర్లు ఇచ్చిన వాంగ్మూలాలు, ఐఏఎస్​ అధికారులు, కాగ్​ అధికారులు చెప్పిన వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారు చెప్పిన అంశాలతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన జీవోలు, ఉత్తర్వులు, పరిపాలనా అనుమతులు, ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లనూ కమిషన్​ పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. రిపోర్టు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని సమాచారం. ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ జరిపిన విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​ అందుకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇటు ఎన్​డీఎస్ఏ నివేదిక కోసం కూడా కమిషన్​ ఎదురు చూస్తున్నది. ఆ రెండు రిపోర్టులను వీలైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్​ లేఖ రాసినట్టు తెలిసింది. రిపోర్ట్​ పూర్తయ్యాక చీఫ్​ సెక్రటరీకి సమర్పించే అవకాశాలున్నాయని సమాచారం. 

పెద్దలను పిలుస్తరా లేదా?

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ, ఆర్థిక అవకతవకలపై అధికారుల నుంచి దాదాపు అన్ని వివరాలను కమిషన్​ రాబట్టింది. అధికారుల విచారణ పూర్తి కావడంతో.. నాడు ఆ ప్రాజెక్టు విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న పెద్దలను పిలుస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదికలో పొందుపరిచే అంశాలు, అధికారులు ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా వారిని విచారణకు పిలిచేది లేనిది ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ వారంలోపే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా కమిషన్​ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని సమాచారం. కాగా, కమిషన్​ రిపోర్ట్​ను సమర్పించేందుకు సర్కారు ఏప్రిల్​ చివరి వరకు గడువును పొడిగించింది.