- గోదావరి వరదలో కలిసిపోయిన కన్నెపల్లి, అన్నారం
- 29 బాహుబలి మోటార్లు, కంట్రోల్ ప్యానళ్లు, సబ్ స్టేషన్ల నిండా నీళ్లు
- రూ. వందల కోట్ల నష్టం.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సిబ్బంది
- డిజైన్, మెయింటనెన్స్ లోపాలే మునకకు కారణమంటున్న నిపుణులు
హైదరాబాద్ / జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం భారీ ప్రాజెక్టు గోదావరి వరద ఉధృతికి అల్లకల్లోలమైంది. నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, దానికి పైనున్న అన్నారం పంపుహౌస్లు పూర్తిగా మునిగిపోయాయి. రెండు పంపుహౌసుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్, కంట్రోల్ ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్ కండిషన్ సిస్టమ్లు, రెండు స్కాడా సిస్టమ్లు, సబ్ స్టేషన్లు ఇట్లా అన్నీ వరదలో కనిపించకుండాపోయాయి. దీంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందుకు డిజైన్, మెయింటనెన్స్ లోపాలే ప్రధాన కారణమని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు. పరిస్థితిని ముందే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇన్ని కోట్ల ప్రజాధనం వరద పాలైందని చెప్తున్నారు. అన్నారం పంపుహౌస్ను బుధవారం రాత్రే వరద చుట్టుముట్టింది. పంపుహౌస్లోకి నీళ్లు ప్రవేశించకుండా స్థానిక సిబ్బంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వాళ్లు పంపుహౌస్ నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు. కన్నెపల్లి పంపుహౌస్లోకి నీళ్లు వెళ్లకుండా నియంత్రించాల్సిన బ్రెస్ట్ వాల్ కూలిపోవడంతో గురువారం మధ్యాహ్నం ఆ పంపుహౌస్ మునిగిపోయింది. ఇందులో పనిచేసే ఇంజనీర్లు, ఇతర స్టాఫ్ వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
అన్నారంలో 129 మీటర్ల మట్టికట్ట తెగి..!
భారీ వర్షాలకు గోదావరి నది మహోద్రంగా ప్రవహిస్తుండటంతో ఎస్సారెస్పీ నుంచి మొదలుపెట్టి అన్నారం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. దీంతో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అన్నారం పంపుహౌస్ను వరద చుట్టుముట్టింది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో జల్లారం వాగు నీళ్లు ఎగతన్నాయి. అవి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అన్నారం పంపుహౌస్ వైపు పరుగులు పెట్టాయి. నిరుడు అన్నారం పంపుహౌస్లోకి ఇదే వాగు నుంచి నీళ్లు చేరడంతో పంపుహౌస్ చుట్టూ(బయట) 129 మీటర్ల ఎత్తయిన ప్రొటెక్షన్ వాల్ (మట్టికట్ట) నిర్మించారు. బుధవారం రాత్రి గోదావరిలో ప్రవాహం పెరగడంతో ఆ నీళ్లు అన్నారం పంపుహౌస్ వైపే వచ్చాయి. దీంతో మట్టికట్ట తెగి పంపుహౌస్ నీట మునిగింది. పంపుహౌస్ వైపు వస్తున్న నీటిని లోపలికి రాకుండా ఫోర్బే వైపు మళ్లించేందుకు అక్కడి సిబ్బంది కొంతసేపు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పంపుహౌస్తో పాటు సబ్ స్టేషన్ నీట మునిగింది.
కన్నెపల్లిలో బ్రెస్ట్ వాల్ కొట్టుకుపోయి..!
కన్నెపల్లి పంపుహౌస్కు గోదావరి నుంచి నీటిని తీసుకుని హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్బేకు తరలిస్తారు. పంపుహౌస్లోని బ్రెస్ట్ వాల్.. లోపలికి నీళ్లు చేరకుండా రక్షిస్తూ ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి 17 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడం, హెడ్ రెగ్యులేటర్ గేట్ల నిర్వహణ, బ్రెస్ట్ వాల్ మెయింటనెన్స్ లోపాలతో ఆ వాల్ కొట్టుకుపోయి పంపుహౌస్ నీట మునిగింది. రూ.180 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ కూడా నీటిలో మునిగిపోయింది. కన్నెపల్లి పంపుహౌస్లో మోటార్లతో పాటు రూ.50 కోట్ల విలువైన స్కాడా సిస్టమ్, కంట్రోల్ ప్యానళ్లు, రూ.150 కోట్లతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ అడ్వాన్స్డ్ ఎయిర్ కండీషన్ సిస్టం తదితర పరికరాలు మునిగిపోయాయి.
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిర్మాణ లోపాలు
- కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్కటిగా నిర్మాణ లోపాలు బయట పడుతున్నాయి.
- 2019 ఆగస్టులో లక్ష్మీపూర్ పంప్హౌస్ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని నీళ్లు లీకయ్యాయి.
- అదే ఏడాది సెప్టెంబర్ 3న కన్నెపల్లి పంప్హౌస్ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతిని మోటార్లపైకి నీళ్లు చేరాయి. మూడో టీఎంసీ పనులు చేస్తున్న టైంలోనూ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతింది.
- 2019 అక్టోబర్ 9న అన్నారం బ్యారేజీ గేట్లలో లీకేజీలు ఏర్పడ్డాయి.
- 2020 ఆగస్టు 23న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్ లైనింగ్ కూలింది.
- మిడ్ మానేరు నింపడంలో ప్రొటోకాల్ పాటించకపోవడంతో 2019 సెప్టెంబర్లో ఆ ప్రాజెక్టు కట్టకు బుంగ పడింది.
- అన్నారం పంపుహౌస్ నుంచి నీటిని సరఫరా చేసే పైపులైన్ నిరుడు జులై 28న భారీ వర్షాలతో భూమిలోంచి పైకితేలింది.
- నిరుడు సెప్టెంబర్ 27న సుందిళ్ల బ్యారేజీ కట్ట దెబ్బతింది.
- కొండపోచమ్మసాగర్ లో నిర్మించిన వాకోవర్ బ్రిడ్జి 2020 ఆగస్టు 30న కూలిపోయింది.
- అదే ఏడాది జులై 7న రంగనాయకసాగర్ డెలివరీ సిస్టర్న్ వద్ద రివిట్మెంట్ దెబ్బతింది.
- ఇక్కడి నుంచి యాదాద్రి జిల్లాకు నీళ్లు తరలించే గ్రావిటీ కెనాల్ 2020 జూన్ 30న తెగింది.
- అదే ఏడాది జూన్ 6న భారీ వర్షాలకు కొండపోచమ్మ పంపుహౌస్ కట్ట దెబ్బతింది.
- 2020 జూన్ 13న మల్లన్నసాగర్ గ్రావిటీ కాల్వకు గండిపడి ఎర్రవల్లి గ్రామంలోని పంట భూములు నీట మునిగాయి.
- ఎస్సారెస్పీకి భారీ వరద ముంచెత్తడంతో 2021 సెప్టెంబర్ 13న నిజామాబాద్ జిల్లాలోని పంపుహౌస్ మునిగిపోయింది.
- ఇప్పుడు భారీ వరదలకు కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్లు మునిగిపోయాయి.
రూ.2,827 కోట్లతో నిర్మించారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద కన్నెపల్లి పంపుహౌస్ను రూ.2,827 కోట్లతో నిర్మించారు. 40 మెగావాట్ల కెపాసిటీ గల 11 మోటార్ల తో 2 టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు చేశారు. మోటార్ల కోసమే రూ. 440 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అడిషనల్ టీఎంసీ కోసం ఇంకో రూ. 240 కోట్లు వెచ్చించి మరో ఆరు మోటార్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ పంపుహౌస్లో 17 మోటార్లు ఉన్నాయి. కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోసేందుకు పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం కాశీపేట వద్ద రూ. 2 వేల కోట్లతో అన్నారం పంపుహౌస్ నిర్మించారు. ఇక్కడ రెండు టీఎంసీల ఎత్తిపోసేందుకు రూ.400 కోట్లతో ఎనిమిది మోటార్లు బిగించారు. అడిషనల్ టీఎంసీ కోసం ఇంకో రూ.200 కోట్లు ఖర్చు చేసి మరో నాలుగు మోటార్లు ఏర్పాటు చేశారు. ఈ పంపుహౌస్లో మొత్తం 40 మెగావాట్ల కెపాసిటీ గల 12 మోటార్లు ఉన్నాయి. రెండు పంపుహౌసుల్లో మేఘా సిబ్బందితో పాటు ఇరిగేషన్ ఇంజనీర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు.
ఎక్స్పర్ట్లు ముందే హెచ్చరించినా..!
కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్లకు ప్రమాదం పొంచి ఉందని డిజైన్స్ విభాగం నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. ప్రాజెక్టు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కన్నెపల్లి పంపుహౌస్ ప్రొటెక్షన్ వాల్ పరిస్థితి, హెడ్ రెగ్యులేటర్ గేట్లలో లీకేజీలపై అలర్ట్ చేశారు. వారి హెచ్చరికలను పంపుహౌస్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పెడచెవిన పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అన్నారం పంపుహౌస్ను గోదావరి నది ప్రవహించే లెవల్ కన్నా దిగువన నిర్మించడంపై డిజైన్ ఎక్స్పర్ట్లు పలు సందేహాలు వ్యక్తం చేశారు. నిరుడు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే జల్లారం వాగు నీళ్లు ఎగతన్ని పంపుహౌస్లోకి చేరాయి. మళ్లీ ఆ పరిస్థితి రాకుండా 129 మీటర్ల లెవల్లో మట్టికట్ట కట్టినా దానికి రివిట్మెంట్ చేయకపోవడంతో అది తెగి ఇప్పుడు పంపుహౌస్ మునిగిపోయింది. ఈ డిజైన్పై అప్పట్లో వచ్చిన సందేహాలను పరిగణలోకి తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎక్స్పర్ట్లు అంటున్నారు. నష్టమెంతో వరద తగ్గాకే చెప్పగలం.
రెండు పంపుహౌస్లు మునిగిన మాట నిజమే
‘‘ మేడిగడ్డ వద్ద రికార్డు స్థాయిలో గోదావరి ప్రవహిస్తున్నది. రెండు పంపుహౌస్లు నీట మునిగిన మాట నిజమే. వరద పూర్తిగా తగ్గిన తర్వాత పంపుహౌస్ల్లో డీవాటరింగ్ చేయాలి. అందులో పేరుకుపోయిన బురద, ఇసుక తొలగించిన తర్వాత కంట్రోల్ ప్యానళ్లు, ఇతర ఎక్విప్మెంట్ ఏమేరకు దెబ్బతిన్నాయో చెప్పగలం. మోటార్లను తిరిగి హీట్ చేసి బిగించవచ్చు. మొత్తం పరీక్షిస్తే గానీ ఎంత నష్టం వాటిల్లిందో చెప్పలేం. రెండు పంపుహౌస్లు మునగడానికి దారి తీసిన పరిస్థితులపైనా సమగ్రంగా స్టడీ చేస్తాం.’’
మురళీధర్, ఈఎన్సీ (జనరల్)