- సరస్వతి అంత్య పుష్కరాల కోసం పోలీసుల పకడ్బందీ ప్లాన్
- ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్వే ఏర్పాటు
మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతి అంత్యపుష్కరాలకు పోలీసులు పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. జూన్ 1 వరకు జరిగే అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులకు వచ్చే అవకాశం ఉన్నందున.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 2,500 మంది పోలీసులతో నిఘా పెట్టేలా ప్లాన్ చేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులు, పర్యాటకుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. పుష్కర ప్రదేశాలను డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించనున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే...
సరస్వతి అంత్యపుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాల మళ్లింపు, వన్వే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మీదుగా వచ్చే ప్రైవేట్ వాహనాలను భూపాలపల్లి జిల్లా కేంద్రం, బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్రోడ్, విలాసాగర్, దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మార్గం ద్వారా పార్కింగ్ ప్లేస్కు చేరుకోనున్నాయి. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం, మహదేవపూర్, కాటారం మార్గాల ద్వారా వాహనాలను పంపించనున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూర్, సిరివంచ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను గోదావరి బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశానికి మళ్లించనున్నారు.
కరీంనగర్, పెద్దపల్లి, మంథని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను గంగారం ఎక్స్ రోడ్ గుండా సరస్వతి ఘాట్ సమీపంలోని 1, 2, 3 పార్కింగ్ ప్లేస్లకు పంపనున్నారు. వరంగల్ నుంచి వచ్చే వీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి కాటారం, మహదేవపూర్ మీదుగా కాళేశ్వరం చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో సైతం ఇదే రూట్లో ప్రయాణించేలా ప్లాన్ చేశారు. 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు.
