ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితతో ప్రొటెం చైర్మన్ అమిన్ ఉల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించారు. కవితతో పాటు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎన్నికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కవిత, దామోదర రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిద్దరికీ మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు. కవిత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కవిత కృతజ్ఞతలు చెప్పారు.