కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ముప్ఫై ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. సంచలన విజయం సాధించి, కల్ట్ క్లాసిక్గా నిలిచినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు.
కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. ఆయన కెరీర్లో ఇది 234వ సినిమా. ‘వన్స్ ఎ కింగ్ ఆల్ వేస్ కింగ్’ అంటూ ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం మరో విశేషం. ‘తెనాలి’ తర్వాత కమల్కి రెహమాన్ మ్యూజిక్ ఇస్తోన్న సినిమా ఇదే. హీరో ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ కలిసి నిర్మిస్తున్నారు. ముప్ఫై ఐదేళ్ల తర్వాత మళ్లీ కలిసి వర్క్ చేస్తుండటం పట్ల కమల్ హాసన్, మణిరత్నం సంతోషం వ్యక్తం చేశారు. 2024లో దీన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.