కామారెడ్డి జిల్లాలో భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేండ్ల జైలు

 కామారెడ్డి జిల్లాలో భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేండ్ల జైలు

కామారెడ్డి, వెలుగు : భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేండ్లు జైలు శిక్ష విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి వీఆర్ఆర్​ వరప్రసాద్ సోమవారం తీర్పునిచ్చారు. ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన గొల్ల భార్గవికి గాంధారి మండలం పోతంగల్​కు చెందిన ముక్కార శ్రీనివాస్​తో 2022లో పెండ్లి జరిగింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు.  భర్త శ్రీనివాస్ ఇతడి తల్లి  లక్ష్మి భార్గవిపై లేని పోసి అనుమానాలతో వేధించారు. అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారు.  పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్థి చెప్పినప్పటికీ శ్రీనివాస్​లో మార్పు రాలేదు. భార్గవికి ఒక కుమారుడు పుట్టగా తల్లిగారింట్లో ఉంది. 

తర్వాత కొన్నాళ్లకు అత్త గారింటికి వెళ్లింది. మళ్లీ వేధింపులకు గురిచేయటంతో భార్గవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి  ఫిర్యాదు మేరకు భర్త , అత్తలపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపారు.  సాక్ష్యాలను పరిశీలించిన జడ్జి భర్త శ్రీనివాస్​కు 7 ఏండ్ల జైలు శిక్ష  , రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.  పోలీసుల తరఫున పీపీ రాజ్​గోపాల్​గౌడ్​ వాదించారు.  నిందితుడికి శిక్ష పడేలా కేసు దర్యాప్తు చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.