
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లుగా అధికారులు ప్రకటించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్ట్ ఆశిష్ సంగ్వాన్, బ్యాంక్, ఆయా శాఖల అధికారులు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ప్రాధాన్యత రంగాలకు రూ. 6,993 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1210 కోట్లుగా నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రూ. 5666 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ పంట రుణాలు, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు రుణాలు సకాలంలో మంజూరు చేస్తామన్నారు.
పారిశ్రామిక, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన రుణాలు త్వరగా మంజూరు చేయాలన్నారు. కార్పొరేషన్ల అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని రుణాలు మంజూరు చేయాలని ఎస్పీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ కు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, నాబార్డు డీడీఎం ప్రవీణ్, ఆర్బీఐ ఏజీఎం రెహమాన్, డీఆర్డీఎ ఏపీడీ మురళీ కృష్ణ, బ్యాంక్ అధికారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.