
కామారెడ్డిటౌన్, వెలుగు: భిక్షాటన కోసం రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులను గంటల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ బి.చైతన్యరెడ్డి బుధవారం సాయంత్రం మీడియాకు వివరాలు తెలిపారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మక్కాల నర్సింలు తన భార్య, రెండేండ్ల బాబు హర్షిత్తో కలిసి మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్నఫాస్ట్ ఫుడ్ సెంటర్వద్ద నిద్రపోయారు.
అర్ధరాత్రి లేచి చూసే సరికి బాబు కనిపించలేదు. దీంతో ఆందోళన చెంది బుధవారం ఉదయం టౌన్ పోలీసులకు నర్సింలు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ ఆధ్వర్యంలో టౌన్సీఐ చంద్రశేఖర్రెడ్డి మూడు టీమ్ లతో బాబు కోసం గాలింపు చేపట్టారు. నిద్రపోయిన ఏరియాలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి ఆడ, మగ కలిసి ఇద్దరు వ్యక్తులు వచ్చి బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
వీరిని దోమకొండకు చెందిన పల్లపు రాజు, శారద దంపతులుగా గుర్తించారు. బాబును వెంట తీసుకుని రైల్వే స్టేషన్ఏరియాలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాబును బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.