కామారెడ్డి మున్సిపల్​ వైస్​ చైర్ పర్సన్​ ఇంట్లో ..అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు

కామారెడ్డి మున్సిపల్​ వైస్​ చైర్ పర్సన్​ ఇంట్లో ..అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
  • మహిళా పోలీసులు లేకుండా  అర్ధరాత్రి ఎలా తనిఖీలు చేస్తారని చైర్ పర్సన్ ఆగ్రహం

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి మున్సిపల్ వైస్​ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేశారు.  మహిళా పోలీసులు లేకుండా తనిఖీలు చేయడంపై   ఇందుప్రియ అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్​ పార్టీ లీడర్లు, కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో  చేరుకున్నారు. ఈ క్రమంలో డీఎస్పీ ప్రకాష్​, లీడర్ల మధ్య వాగ్వాదం  జరిగింది. అర్ధరాత్రి సోదాలు చేయడం ఏంటని ఇందుప్రియ నిలదీశారు. తమకు ఫిర్యాదు వస్తే వచ్చామని  డీఎస్పీ చెప్పారు.

‘‘ఫిర్యాదు చేస్తే వచ్చారా? లేక  బీఆర్ఎస్​ వాళ్లు పంపించారా?”అంటూ ఇందుప్రియ ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్​ నాయకుల ఇళ్లలోనే సోదాలు చేస్తున్నారంటూ డీసీసీ ప్రెసిడెంట్​ శ్రీనివాస్​రావు పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కాగా, కాంగ్రెస్​ పార్టీ కామారెడ్డి రూరల్​ ప్రెసిడెంట్​ గూడెం శ్రీనివాస్​రెడ్డి ఆఫీసులో మంగళవారం  ఫ్లయింగ్​ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీలు చేశారు.  సోదాల్లో కొంత నగదు లభించిందని అధికారులు చెప్పారు. అయితే ఎంత నగదు దొరికిందో వెల్లడించలేదు.