కామారెడ్డి, వెలుగు: సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో వ్యూస్, లైక్స్ కోసం ఓ యువకుడు సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియో తీసి పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డిలోని ఇస్లాంపూరా ప్రాంతానికి చెందిన రెడ్లాన్ రోహిత్.. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు భావోద్వేగ వీడియో తీసి మంగళవారం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను గమనించిన కామారెడ్డి టౌన్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. యువకుడి ఇల్లు తెలుసుకుని అక్కడికి వెళ్లగా అతడు క్షేమంగానే ఉన్నాడు. విచారణ చేపట్టగా, ఇన్స్టాగ్రామ్లో వ్యూస్, లైక్స్ కోసం మాత్రమే ఆ వీడియోను పోస్టు చేసినట్లు యువకుడు తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యూస్ కోసం ఇలాంటి చేష్టలకు పాల్పడడం బాధ్యతారాహిత్యమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. సోషల్ మీడియా మోజులో పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీసుల సమయాన్ని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు
