కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెద్దపల్లి, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ సభకు రైతులు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దపల్లిలో బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ప్రధాని జాతికి అంకితం చేయనున్న రామగుండం ఎరువుల కర్మాగారంతో తెలంగాణ రైతులే కాకుండా దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్ఎఫ్ సీఎల్ తో తెలంగాణ రైతులకు ఎరువుల భారం తగ్గిపోతుందన్నారు. సమావేశంలో లీడర్లు జి.సురేశ్​రెడ్డి, సజ్జద్, బి. సతీశ్, ఎ.శ్రీనివాస్, సతీశ్, కొమురయ్య, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

చొప్పదండి: ప్రధాని మోడీ రామగుండంలో నిర్వహించనున్న సభకు ప్రజలు భారీగా తరలి రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చొప్పదండిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఎం.సుదర్శన్​ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ : ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని రాజన్న బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సంతోష్ బాబు, చందుర్తి మండలాధ్యక్షుడు రాకేశ్ పాల్గొన్నారు.  

చదువుకు టీఆర్​ఎస్​ సర్కారు పెద్దపీట: గంగుల

కరీంనగర్ రూరల్, వెలుగు: చదువుతోనే మని షికి కీర్తి, సకల భోగాలు దక్కుతాయని, ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్​134వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్​లో మినిస్టర్​కలాం చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన బాటసారి దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అని అన్నారు. అనంతరం ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థ పటిష్టతకు మౌలానా ఆజాద్​ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.  కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు,  ప్రిన్సిపాల్​ వీర్ల మహేశ్​, మాజీ ఎమ్మెల్సీ ఎన్.లక్ష్మణరావు, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్, కార్పొరేటర్లు వేణు, ప్రకాశ్ పాల్గొన్నారు.

పిల్లల ఆరోగ్యం కోసమే హెల్త్ క్యాంప్

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఉంటున్న పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి జువేరియా అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్​మండలం అలుగునూర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన హెల్త్​క్యాంప్​ను ఆమె పరిశీలించారు. జిల్లాలోని 8 గురుకుల పాఠశాలలో క్యాంపు నిర్వహించామన్నారు. ఆమె వెంట అధికారులు అనంతలక్ష్మి, సూర్య ప్రకాష్ రావు, ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి ఉన్నారు.

ఆయిల్ పామ్​ సాగుపై రైతులకు అవగాహన

జమ్మికుంట, వెలుగు: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం వ్యవసాయ విస్తర్ణ అధికారి లక్ష్మణ్, ఉద్యానవనశాఖ ఫీల్డ్ ఆఫీసర్ వేణు రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. మొక్క నాటిన మూడేళ్ల తర్వాత దిగుబడి ఇస్తుందని, 30 ఏళ్ల వరకు రైతులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎకరానికి  10 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

చొప్పదండి ఏఎంసీ చైర్మన్​గా చుక్కారెడ్డి

చొప్పదండి, వెలుగు: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్​గా రేవెల్లి గ్రామానికి చెందిన గడ్డం చుక్కారెడ్డిని నియమిస్తూ మార్కెటింగ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్​ చైర్మన్​గా చొప్పదండికి చెందిన చీకట్ల రాజశేఖర్, మెంబర్లుగా గాండ్ల శ్రీనివాస్, భైరగోని ఆనందం, దుబ్బాక మల్లేశం, దీటి మధు, ఏనుగు స్వామిరెడ్డి, వడ్లూరి భూమయ్య, ఉసికెమల్ల మధు, చొక్కాల తిరుపతి, తాళ్లపల్లి రాజమల్లయ్య, మారం రాజు, తొడుపునూరి వెంకటేశ్, నలుమాచు కాశీనాథంను నియమించారు. 

‘ప్రధానిని విమర్శించే అర్హత టీఆర్ఎస్ కు లేదు’

ధర్మారం, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీని విమర్శించే అర్హత టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎరువుల కొరత తీర్చేందుకు మూతపడిన ఎరువుల ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభిస్తున్న ఘనత ప్రధానిదని అన్నారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.