కరీంనగర్ : వివాహేతర సంబంధం కారణంగా ఏ పాపం తెలియని ఓ అమాయకుడ్ని హత్య చేశారు ముగ్గురు వ్యక్తులు. తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపాలని ప్రయత్నించి .. అది సాధ్యం కాకపోవడంతో అతని బంధువుని చంపారు. ఈ కేసులో నిందితులని కరీంనగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఆటోనగర్ వద్ద ఈ నెల 10న జరిగిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును చేధించిన వన్ టౌన్ పోలీసులు.. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు. మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టిన సీపీ కమలాసన్ రెడ్డి.. ఈ హత్య కేసు గురించి మాట్లాడుతూ.. శ్రీనివాస్, శివ, సంబోజీ సాయి కిరణ్ అనే ముగ్గురు కలిసి ఈ హత్య చేశారని తెలిపారు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంట పల్లి కి చెందిన తీట్ల శ్రీనివాస్… తన భార్య కరీంనగర్ లోని ఓ యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆ యువకున్ని హతమార్చాలని ప్రయత్నించి అది సాధ్యం కాకపోవడంతో.. అభం శుభం తెలియని అతని బావ అయిన నర్సయ్యను చంపాలని ప్లాన్ వేసాడు.
మరో ఇద్దరు వ్యక్తులతో కలసి ఈనెల 10న తెల్లవారు జామున ఇసుక నింపేందుకు ట్రాక్టర్ తో పాటు వచ్చిన నర్సయ్యను.. శ్రీనివాస్ కాపుకాసి ఉలి, గొడ్డలి, కత్తి సహాయంతో దారుణంగా నరికి చంపాడు. పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామానికి చెందిన కారెంగుల శివ, కరీంనగర్ సుభాష్ నగర్ కు చెందిన సంబోజీ సాయికిరణ్ శ్రీనివాస్ కు సహకరించినట్టు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామని సీపీ అన్నారు.