హైదరాబాద్లో దారుణం.. ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. రెండ్రోజులపాటు వాష్ రూమ్లోనే డెడ్ బాడీ..

హైదరాబాద్లో దారుణం.. ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. రెండ్రోజులపాటు వాష్ రూమ్లోనే డెడ్ బాడీ..
  • ఆపై రెండు ముక్కలుగా చేసి చెరువులో పడేసిండు
  • ఏమీ తెలియనట్టు పీఎస్​లో మిస్సింగ్​ కంప్లయింట్ 
  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో దారుణం  
  • నిందితుడితోపాటు సహకరించిన ఇద్దరు అరెస్ట్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఆస్తి కోసం అక్కను దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని రెండు ముక్కలుగా రంపంతో కోసి చెరువులో పడేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ఆ తమ్ముడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 రాజస్థాన్ రాష్ట్రం జోధ్​పూర్​కు చెందిన లీలాదేవి(40) ఇరవై ఏండ్ల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఎల్బీనగర్ లో కొన్నేళ్లు నివాసముంది. పదేండ్ల కింద భర్త చనిపోవడంతో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం గ్రామానికి వచ్చి రాజస్థాన్​కే చెందిన తన చిన్నాన్న కొడుకైన పప్పు రామ్ కుమావత్, అతడి భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. 

ఇందులోనే చిన్న షట్టర్​లో కిరాణ షాపు నడుపుకుంటోంది. పప్పురామ్​ కూడా బాటసింగారంలోని మెయిన్​రోడ్​లో కిరాణ షాపు పెట్టుకున్నాడు. లీలాదేవికి పిల్లలు ఎవరూ లేరు. పప్పురామ్​కు స్కూల్​కు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం కింద లీలాదేవి తన తమ్ముడైన పప్పురామ్​తో కలిసి ఓ ప్లాటును కొనుగోలు చేసింది. అయితే, పప్పు రామ్ తన ఒక్కడి పేరు మీదే ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో తన వాటా కోసం లీలావతి అడగడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

 ఈ నేపథ్యంలో గత నెల 28న ఇంట్లో ఎవరూ లేని టైంలో లీలాదేవిని.. పప్పురామ్​గొంతు నులిమి హత్య చేశాడు. ఇండిపెండెంట్​హౌస్​కావడంతో పిల్లలు, భార్య ఉన్నా.. ఇంటి బయట మెట్ల కింద వినియోగించకుండా ఉన్న మరో వాష్ రూమ్ లో అక్క డెడ్ బాడీని రెండు రోజులపాటు దాచి ఉంచాడు. తర్వాత దుర్వాసన వచ్చి, చుట్టుపక్కల వారు పిల్లలు గుర్తిస్తారని భయపడి బాడీని దూరంగా పారవేయాలని అనుకున్నాడు. మృతదేహాన్ని  రంపం తీసుకువచ్చి రెండు ముక్కలుగా కోశాడు. ఒక కవర్​లో మొండెం నుంచి తల వరకు, మరో కవర్​లో నడుం దగ్గరి నుంచి కాళ్ల వరకు వేరు చేసి వేశాడు. ఈ రెండు మూటలను తీసుకువెళ్లి మజీద్ పూర్ గ్రామ సమీపంలోని అక్కచెల్లెళ్ల చెరువులో పడేశాడు.  

మిస్సింగ్ అంటూ డ్రామా.. 

అక్క గురించి బంధువులు అడుగుతారని భావించిన పప్పు రామ్ కొత్త ప్లాన్​వేశాడు. వెంటనే ఏమీ తెలియనట్లు జోధ్​పూర్​వెళ్లి ‘అక్క వచ్చిందా? అక్కడ కనిపించడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చిందేమోనని వెతకడానికి వచ్చా.. ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పండి’ అని దొంగ ఏడ్పులు ఏడ్చాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్ పోలీస్​స్టేషన్​లోనే కంప్లయింట్​ఇవ్వాలని చెప్పడంతో ఈ నెల 8న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మిస్సింగ్ కేసు ఫైల్​చేశాడు. అయితే, పప్పురామ్‌‌పై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో తన అక్కకు ఎవరూ లేరని, ఆమెను చంపితే ప్లాట్​గొడవ ఉండదని, బంగారం, డబ్బు కూడా తనకే దక్కుతుందని భావించి చంపానని ఒప్పుకున్నాడు. బుధవారం పోలీసులు చెరువులో గాలించి మృతదేహం భాగాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పప్పు రామ్ కు ఈ హత్యలో సహకరించిన రాకేశ్, సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు.