
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని సూచించారు. మంగళవారం ఆయన సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో మాట్లాడారు. కర్నాటకలోనూ కాంగ్రెస్ గ్యారంటీలను ఇచ్చిందని చంద్రప్ప గుర్తుచేశారు. మహిళలకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ అని ప్రకటించారని.. అయితే ఇప్పడు కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఫ్రీజర్ని అమ లు చేస్తున్నారని చెప్పారు. పది కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని.. ఒక్క కిలో కూడా ఇవ్వ డం లేదన్నారు.
ఉచిత కరెంట్ ఊసే లేదన్నారు. కర్నాటకలో ఇచ్చిన హామీలు అమలుచేయలేని కాంగ్రెస్.. తెలంగాణలో ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. మద్యం, రెవెన్యూ, భూముల అమ్మకంతోనే కేసీఆర్ సర్కారును నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రప్ప స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ, జేడీఎస్ కలిసి ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.