కర్ణాటకలోని మైసూరులోని ఓ చర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆ చర్చిలో ఉన్న బేబీ జీసెస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. చర్చి వెనుక గేటును బ్రేక్ చేసి లోపలికి దుండగులు వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. చర్చిలో ఉన్న డబ్బులను దొంగలించేందుకు దుండగులు ఈ పనిచేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్రిస్మస్ పండుగ ముగిసిన రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్చి ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. చర్చిపై దాడి జరిగిన విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే పాస్టర్కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చర్చి మొత్తాన్ని పరిశీలించారు. దుండగులు చర్చికి వెనుక వైపు తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.