కాశ్మీర్లో ప్రజలకు అందుబాటులోకి పోస్ట్పెయిడ్ మొబైల్ సర్వీసులు
ప్రీపెయిడ్, ఇంటర్నెట్పై కొనసాగుతున్న బ్యాన్
శ్రీనగర్:72 రోజుల తర్వాత కాశ్మీర్లో మొబైల్ ఫోన్ మోగింది. సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని నెట్వర్క్ల పోస్ట్పెయిడ్ సర్వీసులపై బ్యాన్ను తొలగించారు. ప్రీపెయిడ్, ఇంటర్నెట్ సర్వీసులపై ఉన్న బ్యాన్ మాత్రం కొనసాగుతోంది. 40 లక్షల పోస్ట్పెయిడ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, ఇంకా 30లక్షల ప్రీపెయిడ్ సర్వీసులు అందుబాటులోకి రావాల్సి ఉందని అధికారులు చెప్పారు. సోమవారం నుంచి అన్ని పోస్ట్పెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులను ప్రారంభిస్తామని, పరిస్థితులన్నీ చక్కబడినందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని జమ్మూకాశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ ఇంతకు ముందే ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దుతో ఆగస్టు 5 నుంచి జమ్మూకాశ్మీర్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ల్యాండ్ లైన్ సర్వీసులపై నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం, ఈ నెల 10నే టూరిజంపై ఉన్న బ్యాన్ను కూడా
ఎత్తేసింది.
మొబైల్స్ వాడేది టెర్రరిస్టులే: గవర్నర్
కాశ్మీరీలకు మొబైల్ ఫోన్లు ముఖ్యం కాదని, వాటిని టెర్రరిస్టులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఇంటర్నెట్ సర్వీసులను కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామన్నారు. “టెలిఫోన్లు ముఖ్యం కాదు. ప్రజల జీవితాలు, సెక్యూరిటీ ముఖ్యం. గతంలో కూడా ఫోన్లు లేకుండా ప్రజలు బతికారు. టెర్రరిస్టులే మొబైల్ ఫోన్లు ఉపయోగించుకుంటున్నారు” అని ఆయన సోమవారం చెప్పారు. మొబైల్ ఉన్నాలేక పోయినా మాకు పెద్ద తేడా ఉండదు. పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. నిషేధం ఎత్తేశారనే విషయం తెలియదు. నా ఫోన్ ఇంట్లోనే పెట్టి వచ్చాను. ఆంక్షలు ఎత్తేయడం మాత్రం కొంత ఊరట కలిగించింది. – జమ్మూకాశ్మీర్లోని వ్యాపారి