
కౌటాల కంకాలమ్మ కేతేశ్వర స్వామి జాతర వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఐదు గంటలకు కంకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య కల్యాణి దంపతుల పూజలు చేసి జాతర ప్రారంభించారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణారావు సతీమణి రుక్మిణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారు, కేతేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యం, మజ్జిగ పంపిణీ చేశారు. ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు పర్యవేక్షణలో డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దేస్వామి, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు.
- కాగజ్ నగర్,వెలుగు