శాసన మండలిలో కవిత వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. కేసీఆర్ దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని.. దేశ రాజకీయాలంటూ కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తాను ఒప్పుకోలేదన్నారు కవిత. తెలంగాణలో ఉన్న సమస్యలను .. పనులను పక్కన పెట్టి దేశ రాజకీయాలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.
కొత్త రాజకీయ శక్తిగా జాగృతి
మండలి అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. యువత కోసం కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు..తెలంగాణ జాగృతిని కొత్త రాజకీయ పార్టీగా మారుస్తానని చెప్పారు. ఖచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదుగుతానని .. అందరు ఆశీర్వదించి తనకు మద్దతివ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన మళ్లీ చట్ట సభలకు వస్తానని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా..ఒక్క ఎకరాకు నీళ్లియ్యలేదన్నారు కవిత. ఇరిగేషన్ శాఖలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్ రాజ్యాంగ స్ఫూతితో పనిచేయడం లేదన్నారు. తనలాంటి ఒకరిద్దరి మహిళలు మినహా మహిళలకు ఆ పార్టీలో చోటులేదన్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ లో చోటు లేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యమ ద్రోహులను బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకుందన్నారు. ప్రతీ ఆడబిడ్డ తనకు మద్దతివ్వాలని..ఖచ్చితంగా రాజకీయ శక్తిగా తిరిగొస్తానని చెప్పారు.
